ధరణి పోర్టల్‌ ఆశించిన ఫలితాలు.. జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు.. భూవివాదాలను రెండు నెలల్లో పరిష్కరించాలన్న సీఎం

భూ వ్యవహారాల్లో జిల్లా కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ధరణి పోర్టల్‌ ఆశించిన ఫలితాలు.. జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు.. భూవివాదాలను రెండు నెలల్లో పరిష్కరించాలన్న సీఎం
Follow us

|

Updated on: Jan 01, 2021 | 9:23 AM

cm kcr dharani review: రాష్ట్రంలో వ్యవసాయ భూవివాదాలను రెండు నెలల్లో పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. భూ వ్యవహారాల్లో జిల్లా కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్లే ఈ బాధ్యత లను పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్‌ నిర్వహణపై గురువారం ప్రగతిభవన్‌లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు

ధరణి పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత మెరుగుపరుస్తున్నట్లు సీఎం వెల్లడించారు. వ్యవసాయ భూముల విషయంలో నెలకొన్న కొద్దిపాటి సందిగ్ధతలను జిల్లా కలెక్టర్లు పరిష్కరించాలని సూచించారు. కోర్టుల విచారణలో ఉన్నవి మినహా, భూరికార్డుల సమగ్ర సర్వే సందర్భంగా పార్ట్‌–బీలో చేర్చిన భూములకు సంబంధించిన అంశాలన్నింటినీ కలెక్టర్లు 60 రోజుల్లో పరిష్కరించాలి. అవసరమైతే క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు పర్యటించి విచారణ జరిపి యాజమాన్య హక్కులను ఖరారు చేయాలన్నారు. రెవెన్యూ కోర్టుల్లోని వివాదాలను పరిష్కరించడానికి జిల్లాకు ఒకటి చొప్పున కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలన్న సీఎం.. సరిహద్దు వివాదాలున్న చోట జిల్లా కలెక్టర్లు సర్వే నిర్వహించి, హద్దులు సూచించాలన్నారు.

జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గతంలో రిజిస్ట్రేషన్‌ అయిన భూములను రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్ల ఆధారంగా, కొన్నవారి పేరిట మ్యుటేషన్‌ చేయాలని సీఎం తెలిపారు. మీ–సేవ ద్వారా మ్యుటేషన్‌ దరఖాస్తులు స్వీకరించి, స్లాట్లు కేటాయించాలి.. సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి. క్రమబద్ధీకరించిన సాదాబైనామాల ప్రకారం భూముల వివరాలను ధరణి సైట్‌లో నమోదు చేయాలి. పట్టాదారు పాస్‌ బుక్కులు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

కోర్టు తీర్పులకు సంబంధించిన పూర్తి వివరాలను ధరణిలో ప్రత్యేకంగా పొందుపర్చాలని సీఎం తెలిపారు. కోర్టు పోర్టల్‌ను ధరణిలో చేర్చాలన్న సీఎం.. సేత్వార్‌ వ్యత్యాసాలపై కలెక్టర్లు విచారణ జరిపి, తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. అలాగే, ఒకే సర్వే నంబరులో ప్రభుత్వ, ప్రైవేటు భూములున్నాయి. ఆ సర్వే నంబరును నిషేధిత జాబితా (22/ఏ) లో పెట్టారు. అలా పెట్టిన చోట్ల కలెక్టర్లు విచారణ జరిపి, ఏది ప్రభుత్వ, ప్రైవేటు భూమిని నిర్ణయించాలి. అర్హుల వివరాలను ధరణిలో చేర్చి, పాస్‌ పుస్తకాలు జారీ చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. అలాగే, నాలా’ద్వారా కన్వర్ట్‌ అయిన భూముల వివరాలను ధరణిలో నమోదు చేసి, వాటికి ప్రొసీడింగ్స్‌ ఇవ్వాల్సిన బాధ్యత కూడా జిల్లా కలెక్టర్లదే. వ్యవసాయ భూముల్లో నెలకొల్పే సంస్థలు, కంపెనీలు ఆ భూములు అమ్ముకునేందుకు, కొనుక్కునేందుకు ధరణిలో తక్షణం అవకాశం కల్పించాలని వెల్లడించారు.

ఏదైనా అనివార్య కారణాల వల్ల స్లాట్‌ బుక్‌ చేసుకున్న రోజు రాని వారికి స్లాట్‌ రద్దు చేసుకోవడానికి, మరో రోజు బుక్‌ చేసుకునేందుకు అవకాశమివ్వాలన్న సీఎం.. స్లాట్‌ బుకింగ్‌ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి వాపసు చేయాలన్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకునేప్పుడు వివరాలు తప్పుగా నమోదైతే, స్లాట్‌ బుక్‌ చేసుకున్న చోటే వాటిని సవరించుకునేందుకు రిజిస్ట్రేషన్‌ కన్నా ముందు అవకాశం కల్పించాలి. పాస్‌పోర్టు నంబరు నమోదు చేసుకుని ఎన్‌ఆర్‌ఐల భూములు రిజిస్ట్రేషన్‌ చేసే అవకాశం కల్పించాలి.

చట్టబద్ధ వారసుల పేర్లను రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లలో అనుమతిదారుల (కన్సెంటింగ్‌ పార్టీ) కేటగిరీ కింద నమోదు చేసుకునే ఆప్షన్‌ కల్పించాలి. మైనర్ల పేరిట భూములు రిజిస్ట్రేషన్‌ చేసే సందర్భంలో మైనర్లు, సంరక్షుల పేర పట్టాదారు పాస్‌ పుస్తకం ఇవ్వాలి. ప్రభుత్వం అసైన్‌ చేసిన భూములు అనుభవిస్తున్న రైతులు మరణిస్తే, వారి చట్టబద్ధ వారసులకు ఆ భూములను బదలాయించేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. అలాగే, ప్రభుత్వ భూములు, చెరువు ఎఫ్‌.టి.ఎల్‌. భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్‌ భూములు, అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్‌ చేయవద్దని ఆదేశించారు.

వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండవద్దనే ఉద్దేశంతో తెచ్చిన ధరణి పోర్టల్‌ ఆశించిన ఫలితాలు సాధిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.