తెలంగాణలో పాగా వేసేందుకు భారతీయ జనతాపార్టీ స్కెచ్.. బల్ధియాలో బల ప్రదర్శనకు సన్నద్ధం..
ప్రత్యర్ధిని బలహీన పరిస్తే ...మనం బలపడినట్లే అన్న ఆలోచనతో ముందుకెళ్తోంది భారతీయ జనతా పార్టీ. అందుకోసం ప్రతి అంశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుంటోంది.
ఇంతకాలం పట్టు కోసం ఎదురుచూసిన కమలం పార్టీ ఇప్పుడు తెలంగాణలో పాగా వేసేందుకు పక్కాగా స్కెచ్ వేస్తోంది. దుబ్బాక ఫలితాలతో ఫుల్ జోష్ మీదున్న భారతీయ జనతాపార్టీ నేతలు… బల్ధియాలో బల ప్రదర్శనకు కాలు దువ్వుతున్నారు. మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు తగిన విధంగా పావులు కదుపుతున్నారు. ఏం చేసైనా గ్రేటర్లో మేమే గ్రేట్ అనిపించుకోవాలని చూస్తున్నారు.
ప్రత్యర్ధిని బలహీన పరిస్తే …మనం బలపడినట్లే అన్న ఆలోచనతో ముందుకెళ్తోంది భారతీయ జనతా పార్టీ. అందుకోసం ప్రతి అంశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుంటోంది. తాజాగా దుబ్బాక రిజల్ట్స్ తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా రావడంతో దూకుడు పెంచారు ఆపార్టీ నేతలు. అదే జోరును జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూపించాలనుకుంటున్నారు. ఇందుకోసం అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూనే మజ్లీస్తో వారికున్న స్నేహబంధాన్ని అడ్వాంటేజ్గా మార్చుకుంటోంది బీజేపీ. ఇందుకోసం బీహార్ ఎన్నికల ఫలితాలను అడ్డుపెట్టుకొని రెండు పార్టీలపై విమర్శలకు దిగారు కమలం నేతలు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం ఐదు స్థానాల్లో విజయం సాధించడం వెనుక ప్రధానంగా టీఆర్ఎస్ హస్తముందనే ఆరోపణ చేస్తోంది బీజేపీ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంఐఎం అభ్యర్ధులు గెలిచేందుకు నిధులు సమకూర్చరంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అంతే కాదు… ఎంఐఎం ఓ దేశద్రోహ పార్టీ అని దాన్ని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు టీఆర్ఎస్ ఆపార్టీతో దోస్తీ కడుతోందని ఆరోపణలు గుప్పించారు.
గ్రేటర్ పరిధిలో గోషామహల్ ఎమ్మెల్యే , సికింద్రాబాద్ ఎంపీ స్థానాలు మినహా ఎక్కడా బీజేపీ ఎమ్మెల్యేలు గెలవలేదు. ప్రత్యర్ధి పార్టీలను టార్గెట్ చేస్తేనే రేపో మాపో జరిగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు తమకు అనుకూలంగా మారుతాయని భావిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ, అక్భరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ సోదరులను వెంట పెట్టుకొని హైదరాబాద్ మొత్తం తిరిగినా గెలిచేది బీజేపీనే అంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కమలనేతలు. ఇందుకోసం అప్పుడే పావులు కదిపిన బీజేపీ నేతలు వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలందరినీ కమల దళంలోకి ఆహ్వానిస్తున్నారు.