ఛత్తీస్గఢ్ లో గ్యాంగ్ రేప్.. అవమానంతో యువతి ఆత్మహత్య
కామంతో కళ్లు మూసుకుపోయిన దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వివాహ వేడకకు హాజరై ఇంటికి తిరిగి వస్తున్న ఓ బాలికను సమీప అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లి ఏడుగురు వ్యక్తులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు.
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై యావత్ దేశం ముక్తకంఠంతో నిరసన తెలుపుతుంటే, మరోవైపు దేశం నిత్యం ఎదో చోట కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్ మానవ మృగాలు రెచ్చిపోయాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వివాహ వేడకకు హాజరై ఇంటికి తిరిగి వస్తున్న ఓ బాలికను సమీప అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లి ఏడుగురు వ్యక్తులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. రాత్రంతా బాలికను బంధించి నిందితులు తెల్లవారుజామున వదిలేశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన బాధితురాలు అవమానాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. గత జూలైలో కొండగావ్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత జూలైలో బాధిత బాలిక స్నేహితుడితో కలిసి ఓ పెండ్లికి వెళ్లింది. పెండ్లి నుంచి తిరిగి వస్తుండగా అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు బాలిక స్నేహితుడిని తీవ్రంగా కొట్టి ఆమెను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లారు. అక్కడికి మరో ఐదుగురిని పిలిపించుకుని ఏడుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రంతా బాలికతోనే గడిపిన నిందుతులు తెల్లవారుజామున ఆమెను వదిలేశారు. అవమాన భారంతో కుంగిపోయిన ఆమె ఇంటికి చేరుకోగానే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
బాధితురాలి స్నేహితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడటంతో ఏం చేయాలో తోచక మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, ఆ తర్వాత కూడా నిందితులను శిక్షించాలంటూ బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదు. దీంతో తన కూతురుకు న్యాయం జరుగలేదని మనోవేదన భరించలేక అక్టోబర్ 6న ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఈ విషయం మీడియా దృష్టికి వెళ్లడంతో స్థానిక మీడియా సంస్థలన్నీ జరిగిన ఘోరం గురించి తెలుసుకుని పతాక శీర్షికల్లో ప్రచురించాయి. ఈ ఘోరం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న బాధిత కుంటుంబం ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఈ విషయమై గతంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు.