‘కొడాలి నానితో చెప్పించడం వెనుక అతిపెద్ద కుట్ర’
ఏపీ రాజధాని విషయంలో పెద్ద కుట్రే జరుగుతుందని టీడీపీ రాజ్యసభసభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. అమరావతిలో శాసన రాజధాని కూడా అవసరం లేదని మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు..
ఏపీ రాజధాని విషయంలో పెద్ద కుట్రే జరుగుతుందని టీడీపీ రాజ్యసభసభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. అమరావతిలో శాసన రాజధాని కూడా అవసరం లేదని మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు వెనుక అసలు వైసీపీ పెద్దలున్నారని ఆయన ఆరోపించారు. కావాలనే కొడాలి నానితో ఆ మాట చెప్పించారని.. దాని వెనుకే అసలు విషయం దాగుందన్నారు. పేదలకు భూములు పంచే నెపంతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు యత్నిస్తోందని కనకమేడల మండిపడ్డారు. కోర్టులు తమ నిర్ణయాలను అడ్డుకుంటాయని ప్రభుత్వానికి ముందే తెలుసని… కావాలనే న్యాయస్థానాలను కూడా రాజకీయాల్లోకి లాగాలని చూస్తోందని అన్నారు. పేదలకు భూములు ఎందుకు పంచడం లేదని ప్రశ్నించిన ఆయన, చంద్రబాబు హయాంలో కట్టించిన దాదాపు 6 లక్షల ఇళ్లను పేదలకు ఇవ్వకుండా ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు. పేదలకు సెంటు భూమి ఇస్తే సరిపోతుందని చెపుతున్న వైసీపీ పెద్దలు… పెద్దపెద్ద భవంతుల్లో ఎందుకు ఉంటున్నారని కనకమేడల ప్రశ్నల వర్షం కురిపించారు. అంతర్వేది ఆలయరథం దగ్ధం ఘటనతో ప్రభుత్వం మతపరమైన క్రీడ ఆడాలని చూస్తోందని చెప్పుకొచ్చారు.