తమిళనాడులో 40 వేల మార్క్ దాటిన కొవిడ్ కేసులు
తమిళనాడులో 24 గంటల్లో నమోదైన 1,982 కరోనా పాజిటివ్ కేసులతో కలిపి 40,698కి చేరింది.
తమిళనాడులో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. గత 24 గంటల్లో నమోదైన 1,982 కరోనా పాజిటివ్ కేసులతో కలిపి 40,698కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. కొత్తగా నమోదైన కేసుల్లో 1,933 మంది స్థానికులు కాగా , 49 మంది విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వెనక్కి వచ్చినవారని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 18 మంది మరణించగా.. కరోనాతో 367 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 1,342 ఇళ్లకు చేరుకున్నారని వెల్లడించింది. ఇక వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పూర్తి చేసుకుని 22,047 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 18,284 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా చెన్నై సిటీలోనే 28,924 కరోనా కేసులు నమోదయ్యాయని పేర్కొంది.