తమిళనాడులో 26 వేలకు చేరువలో కరోనా కేసులు
తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,286 మందికి కరోనా పాజిటివ్. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,872.
తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొద్దిరోజులుగా రోజుకి వెయ్యి కేసులకు తగ్గకుండా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,286 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,872కు చేరింది. బుధవారం సాయంత్రం వరకు రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇవాళ మొత్తం 1286 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో 1244 మంది స్థానికులు కాగా.. 42 మంది విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారని తెలిపింది. కరోనా నుంచి కోలుకుని బుధవారం 610 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు మొత్తం 14,316 మంది కోలుకున్నారు. బుధవారం చనిపోయిన 11 మందితో కలిపి మొత్తంగా 208 మందిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,345 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తమిళనాడు ఆరోగ్య శాఖ తెలిపింది. తమిళనాడులో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో ఒక్క చెన్నై సిటీలోనే భారీగా 17,598 కేసులు నమోదయ్యాయి. అలాగే రాష్ట్రంలో ఎక్కువగా మగవాళ్లే కరోనా బారినపడ్డారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 16,181 మగవాళ్లు కరోనా బారినపడగా.. 9,677 మహిళలకు, 14 మంది ట్రాన్స్ జెండర్లకు వైరస్ సోకిందని వెల్లడించింది.