కాపురంలో మద్యం చిచ్చు.. దంపతుల ఆత్మహత్య
తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మద్యం సేవించి ఇంటికొచ్చిన భర్తను మందలించిన పాపానికి భార్యపై కిరోసిన్ పోసి తానూ నిప్పంటించుకున్నాడు. ఈఘటనలో దంపతులిద్దరు దుర్మరణం పాలవ్వగా.. వారిని కాపాడేందుకు యత్నించిన కొడుకు, కుమార్తెకు గాయాలయ్యాయి.
తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మద్యం సేవించి ఇంటికొచ్చిన భర్తను మందలించిన పాపానికి భార్యపై కిరోసిన్ పోసి తానూ నిప్పంటించుకున్నాడు. ఈఘటనలో దంపతులిద్దరు దుర్మరణం పాలవ్వగా.. వారిని కాపాడేందుకు యత్నించిన కొడుకు, కుమార్తెకు గాయాలయ్యాయి.
మదురై జిల్లా ఉసిలంపట్టి సమీప అల్లిగుండాం గ్రామానికి చెందిన జయరామ్ (38), కని (33) దంపతులకు కుమారుడు కవిన్(15) కుమార్తె దర్శిని (13) ఉన్నారు. జయరామ్ ఓ లారీ కొనుక్కుని సరుకు రవాణా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదే క్రమంలో ఇటీవల పొరుగు రాష్ట్రానికి సరుకు రవాణా చేసేందుకు వెళ్లిన సమయంలో లారీ చెడిపోయింది. దీంతో మరమ్మతుల కోసం డబ్బులు తీసుకొని వచ్చేందుకు ఆ ప్రాంతంలోనే వదిలిన జయరామ్ ఇంటికి వచ్చాడు.
ఇదిలావుంటే, మంగళవారం స్నేహితులతో కలసి మద్యం సేవించి ఇంటికొచ్చిన భర్తతో భార్య కని నిలదీసింది. దీంతో ఆగ్రహించిన జయరామ్ భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అటు తనపై కూడా కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. బాధను భరించలేక వారి పెట్టిన కేకలతో బయటకొచ్చిన వారి పిల్లలు కవిన్, దర్శిని.. వారిని రక్షించబోగా వారికి గాయాలయ్యాయి. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు చేరుకొని మంటలను ఆర్పి ఆ నలుగురిని ఉసిలంపట్టి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య కని మృతి చెందింది. ఇదిలా ఉంటే ప్రాథమిక చికిత్స అనంతరం జయరామ్ను మదురై ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఈ ఘటనపై సేటపట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్షణికావేశంలో ఇద్దరి ప్రాణాలు కోల్పోగా, వారి ఇద్దరి పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు.