చంద్రబాబుకు నోటీసిచ్చిన తహసీల్దార్
ఏపీ విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చారు తాడేపల్లి తహసీల్దార్. కృష్ణా నది కరకట్టపై నివాసముండడం ప్రస్తుత పరిస్థితుల్లో సరికాదని, తక్షణం సురక్షిత...
Tahasildar sent notice to Chandrababu: ఏపీ విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చారు తాడేపల్లి తహసీల్దార్. కృష్ణా నది కరకట్టపై నివాసముండడం ప్రస్తుత పరిస్థితుల్లో సరికాదని, తక్షణం సురక్షిత ప్రాంతానికి షిఫ్టుకావాలని తహసీల్దార్ చంద్రబాబుకు నోటీసు పంపారు. ఈ మేరకు మంగళవారం చంద్రబాబుతోపాటు మరో 36 మందికి నోటీసులు జారీ చేశారు తాడేపల్లి తహసీల్దారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణా నదిలోకి కూడా భారీ ఎత్తున వరద నీరు పోటెత్తుతోంది. ఇప్పటికే లక్షలాది క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రం వైపు తరలించారు. ఎగువ రాష్ట్రాలలో ఇంకా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలోకి మరింత వరద నీరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 13 నుంచి 16వ తేదీ మధ్యన సుమారు 6 లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణా నదిలోకి వచ్చే సంకేతాలు కనిపిస్తుందని నోటీసులో పేర్కొన్నారు.
కృష్ణా నదిలోకి వరద నీరు పోటెత్తడంతో సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగానే చంద్రబాబుకు నోటీసులిచ్చారు తాడేపల్లి తహసీల్దారు. కరకట్ట మీద వున్న చంద్రబాబు నివాసానికి వరద ప్రమాదం పొంచి వుందన్నది నోటీసు సారాంశం. ఇంకా లక్షలాది క్యూసెక్కుల నీరు కృష్ణా నదిలోకి రానుండడంతో కరకట్టపై నివాసం శ్రేయస్కరం కాదని, చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు తక్షణం ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని తహసీల్దారు జారీ చేసిన నోటీసులు పేర్కొన్నారు. ఇదే రకమైన నోటీసులను మరో 36 మందికి జారీ చేసినట్లు తహసీల్దారు తెలిపారు.
Also read: ప్రభుత్వంపై కోర్టుకెక్కిన సినీ నిర్మాత
Also read: ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు