Tablighi Jamaat Event: తబ్లీఘీ జమాత్ ఈవెంట్, 36 మంది విదేశీయులంతా నిర్దోషులే, ఢిల్లీ కోర్టు తీర్పు
ఢిల్లీలో తబ్లీఘీ జమాత్ ఈవెంట్ కు హాజరైన 36 మంది విదేశీయులూ నిర్దోషులేనని ఢిల్లీ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. గత మార్చిలో ప్రబలిన కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను..
ఢిల్లీలో తబ్లీఘీ జమాత్ ఈవెంట్ కు హాజరైన 36 మంది విదేశీయులూ నిర్దోషులేనని ఢిల్లీ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. గత మార్చిలో ప్రబలిన కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను, ప్రోటోకాల్ ను నిర్లక్ష్యం చేశారని వీరిపై ఛార్జి షీట్ నమోదు అయింది. కాగా 14 దేశాలకు చెందిన వీరు నిర్దోషులని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అరుణ్ కుమార్ గార్గ్ తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించారనడానికి వీరిపై ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. భారత శిక్షా స్మృతితో బాటు విదేశీ చట్టం, డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం, ఎపిడమిక్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వీరిపై గత ఆగస్టులో చార్జిషీట్ నమోదయింది. అయితే క్వారంటైన్ రూల్స్ ని అతిక్రమించారనో, ఒకే చోట ఎక్కువమంది గుమికూడారనో..సంబంధిత నిబంధనల కింద పెట్టిన సెక్షన్ల నుంచి వీరిని కోర్టు విముక్తులను చేసింది.
ఆరు దేశాలకు చెందిన 8 మంది విదేశీయులను కూడా నిర్దోషులుగా కోర్టు పేర్కొంది. వీసా రూల్స్ ని అతిక్రమించారని, తబ్లీఘీ జమాత్ సమావేశానికి హాజరయ్యారని గత మార్చిలో వీరికి సంబంధించిన వార్తలు పతాక శీర్షికలకెక్కాయి. మొత్తం 955 మంది విదేశీయులపై ఢిల్లీ పోలీసులు ఛార్జి షీట్ నమోదు చేశారు. వీరిలో చాలామంది అప్పుడే తమ దేశాలకు తిరిగి వెళ్లిపోగా, 44 మంది కోర్టు విచారణను ఎదుర్కొంటామన్నారు. కాగా 36 మంది విదేశియులపై కోర్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవంటూ ఉత్తర్వులు జారీ చేయడంపై పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.