సుశాంత్ పేరు మీదుగా ఫౌండేషన్.. మెమోరియల్గా ఇల్లు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి 13 రోజులు అవుతుండగా.. 'గుడ్బై సుశాంత్' పేరుతో ఆయన కుటుంబం ఓ ప్రకటనను విడుదల చేసింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి 13 రోజులు అవుతుండగా.. ‘గుడ్బై సుశాంత్’ పేరుతో ఆయన కుటుంబం ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో సుశాంత్ని గుర్తు చేసుకుంటూ తాము తీసుకున్న కీలక విషయాలను వెల్లడించింది. అందులో ”ప్రపంచానికి సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాకు ఎప్పటికీ గుల్షన్నే(ప్రేమతో పిలుచుకునే పిలుపు). తను చాలా స్వేచ్ఛాయుతమైన మనసు గలవాడు. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు. చాలా తెలివైనవాడు. ప్రతి విషయంలోనూ అతడు ఆసక్తిని చూపేవాడు. ఎన్నో కలలను కన్న సుశాంత్.. వాటిని ధైర్యమైన హృదయంతో నెరవేర్చుకునేవాడు.
అతడు స్వచ్ఛంగా నవ్వేవాడు. సుశాంత్ మా కుటుంబానికి గర్వకారణం. అతడి టెలిస్కోప్ అతడికి చాలా విలువైనది. దాని ద్వారా నక్షత్రాలను అతడు ఆసక్తిగా వీక్షించేవాడు. అతడి నవ్వులు ఇక మేము వినలేము. ఎప్పుడూ మెరిసే కళ్లను ఇకపై చూడలేము. సైన్స్ గురించి అతడు చెప్పే విషయాలను మేము వినలేము. ఇవన్నీ జీర్ణించుకోవడం మాకు చాలా కష్టం. అతడి లోటు, శూన్యత మా కుటుంబంలో ఎప్పటికీ భర్తీ కానిది. తన అభిమానులందరినీ అతడు చాలా ఇష్టపడ్డాడు. మా గుల్షన్పై అంత ప్రేమను చూపిన అందరికీ ధన్యవాదాలు.
అతడి ఙ్ఞాపకాలు, వారసత్వం ఎప్పటికీ కొనసాగాలని అనుకుంటూ మా కుటుంబం ఓ నిర్ణయం తీసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫౌండేషన్ను స్థాపించి సినిమా, సైన్స్, క్రీడల్లో టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహించాలనుకుంటున్నాము. పాట్నాలోని రాజీవ్ నగర్లో సుశాంత్ చిన్నప్పుడు పెరిగిన ఇంటిని మెమోరియల్గా మారుస్తున్నాం. అతడికి సంబంధించిన పలు వస్తువులను అక్కడ పెట్టబోతున్నాం. అందులో బుక్లు, టెలిస్కోప్ తదితర వస్తువులు ఉంటాయి. ఇప్పటి నుంచి అతడి సామాజిక మాధ్యమాలను తామే నిర్వహిస్తూ.. సుశాంత్ ఙ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటుంటాం. మీ అందరి ప్రార్థనలకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం” అని పేర్కొన్నారు.