సుశాంత్ మృతి కేసు.. స్టార్ దర్శకుడిని ప్రశ్నించనున్న పోలీసులు..!
బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణను వేగవంతం చేశారు ముంబయి పోలీసులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 28 మందిని ప్రశ్నించిన పోలీసులు.. వారి నుంచి పలు కీలక విషయాలను సేకరించారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణను వేగవంతం చేశారు ముంబయి పోలీసులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 28 మందిని ప్రశ్నించిన పోలీసులు.. వారి నుంచి పలు కీలక విషయాలను సేకరించారు. కాగా ఈ కేసులో స్టార్ దర్శకుడు శేఖర్ కపూర్ను పోలీసులు విచారించబోతున్నట్లు తెలుస్తోంది. సుశాంత్తో శేఖర్ కపూర్ ‘పానీ’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. యశ్రాజ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చింది. అయితే కొన్ని కారణాల వలన యశ్రాజ్ సంస్థ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో.. శేఖర్ కపూర్నే ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించాలనుకున్నారు. కానీ ఆ లోపే సుశాంత్ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు.
కాగా సుశాంత్ మృతి సమయంలో శేఖర్ కపూర్ వేసిన ఓ ట్వీట్ అప్పట్లో సంచలనంగా మారింది. ”నీ జీవితంలో నువ్వు ఎంత బాధ పడుతున్నావో నాకు తెలుసు. నిన్ను చెడ్డవాడిగా చిత్రీకరించి, కిందికి లాగాలని ప్రయత్నించిన వారి కథలు నాకు తెలుసు. వారి వలన నా భుజంపై ముఖం వాల్చి నువ్వు ఏడ్చావు. ఆరు నెలలుగా నేను నీతో ఉండాల్సింది. నువ్వు కూడా నా దగ్గరకు రావాల్సింది. ఏం జరిగినా అది వారి కర్మ. నీది కాదు” అని శేఖర్ కపూర్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో సుశాంత్ ఏ విషయంలో బాధపడ్డారన్న విషయంపై శేఖర్ కపూర్ను విచారించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు పంపనున్నట్లు సమాచారం.