సుశాంత్ ఆత్మహత్య: బాలీవుడ్ ప్రముఖులకు ఊరట
సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్లో 8 మంది ప్రముఖులపై బీహార్కి చెందిన ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్లో 8 మంది ప్రముఖులపై బీహార్కి చెందిన ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుశాంత్ని ఏడు చిత్రాల నుంచి తీసేశారని, ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ఆ ఎనిమిది మందే కారణమంటూ సుధీర్ కుమార్ ఓజా తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు వారిపై 306, 109, 504, 506 సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఈ పిటిషన్ను బీహార్లోని జిల్లా కోర్టు కొట్టివేసింది. ఇది కోర్టు పరిధిలోని రాదని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముఖేష్ కుమార్ తెలిపారు.
ఇక ఈ తీర్పుపై సుధీర్ మాట్లాడుతూ.. న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును నేను ఛాలెంజ్ చేయబోతున్నా. సుశాంత్ మరణంతో బీహార్ చాలా బాధలో ఉంది. చిన్న వయస్సులో సుశాంత్ అంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి అసలు కారకులు ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని అన్నారు. కాగా సుధీర్ ఫిర్యాదు చేసిన లిస్ట్లో కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, అదిత్యా చోప్రా, సాజిద్ నడియాద్వాలా, సంజయ్ లీలా భన్సాలీ, భూషణ్ కుమార్, ఏక్తా కపూర్, దర్శకుడు దినేష్ పేర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు సుశాంత్ ఆత్మహత్యపై ముంబయి పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో సుశాంత్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు సహా ఇప్పటివరకు 34 మందిని విచారించిన పోలీసులు, వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు.