సుశాంత్ కేసు.. ‘బాలీవుడ్’పై సీబీఐ దృష్టి
మిస్టరీ స్టోరీని తలపిస్తోన్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసుపై పలు కోణాల్లో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే
Sushant Case Updates: మిస్టరీ స్టోరీని తలపిస్తోన్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసుపై పలు కోణాల్లో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈడీ, సీబీఐ, ఎన్సీబీ అధికారులు ఈ కేసులో విచారణను వేగవంతం చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా..? హత్యకు గురయ్యాడా..? అన్న విషయంపై ఇంకా డైలమా కొనసాగుతుండగా.. ఎప్పుడూ యాక్టివ్గా ఉండే సుశాంత్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియాలని కుటుంబ సభ్యులు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ కేసులో సీబీఐ ఇప్పటికే సుశాంత్ చనిపోయిన రోజు ఏం జరిగింది..? అంతకుముందు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారు..? సుశాంత్ మరణించిన రోజు అక్కడ ఎవరెవరు ఉన్నారు..? అన్న కోణంలో దర్యాప్తు చేసింది. ఇక ఇప్పుడు మరిన్ని కోణాల్లో దర్యాప్తును చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్యంగా బాలీవుడ్లో సుశాంత్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు..? బయటి వాడు అని అతడికి సినిమా అవకాశాలు ఇవ్వలేదా..? సుశాంత్తో సినిమా తీయాలనుకున్న వారు ఎవరు..? అన్న కోణంలో వారి దర్యాప్తు కొనసాగనున్నట్లు సమాచారం. సుశాంత్ చనిపోయిన తరువాత బాలీవుడ్పై పలు ఆరోపణలు వచ్చాయి. కొంతమంది అతడికి అవకాశాలు లేకుండా చేశారని, కొన్ని నిర్మాణ సంస్థలు సుశాంత్ని బాయ్కాట్ చేశాయని, చాలా సినిమాల్లో ఈ హీరోను మార్చి మరొకరిని పెట్టారని, నెపోటిజం వలనే సుశాంత్కి ఆఫర్లు రాలేదని పలు విమర్శలు వినిపించాయి. ఆ ఆరోపణలపై కూడా సీబీఐ దర్యాప్తు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అలాగే డిప్రెషన్ కోణంలోనూ వారి దర్యాప్తు జరగనున్నట్లు సమాచారం. మరోవైపు గ్రడ్స్ కేసులో ఇప్పటికే ఎన్సీబీ అధికారులు పలువురిని అరెస్ట్ చేయగా.. రియాను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read More: