రియాకు వ్యతిరేకంగా చెప్పమంటున్నారు: సుశాంత్ ఫ్రెండ్
బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణించి నెలన్నర రోజులు అవుతోంది. అయితే ఈ కేసులో ఈ మధ్య కాలంలో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది.
Siddharth Pithani allegations on Sushant Family: బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణించి నెలన్నర రోజులు అవుతోంది. అయితే ఈ కేసులో ఈ మధ్య కాలంలో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఈ కేసును విచారిస్తోన్న ముంబయి పోలీసులు పలువురిని విచారించి, స్టేట్మెంట్లను రికార్డు చేశారు. త్వరలో మరికొంతమందిని విచారించబోతున్నారు. మరోవైపు తన కుమారుడి హత్యకు రియా సహా ఆరుగురు కారణమంటూ సుశాంత్ తండ్రి బీహార్ పోలీస్లకు ఫిర్యాదు చేశారు. దీనిపై బీహార్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇక సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది.
సుశాంత్ మృతి తరువాత అతడి ఇంట్లో ఫోరెన్సిక్ నిపుణుల వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా.. ‘రియా వేధిస్తోందని సుశాంత్ తనకు చెప్పినట్లు’ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇదిలా ఉంటే అసలు సుశాంత్ది ఆత్మహత్య కాదు హత్య అంటూ కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు. ఇలా రోజుకో మలుపు తిరుగుతోన్న ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సుశాంత్ కుటుంబం తనపై ఒత్తిడి తెస్తోందని సంచలన ఆరోపణలు చేశారు అతడి స్నేహితుడు క్రియేటివ్ కంటెంట్ మేనేజర్ సిద్ధార్థ్ పిథాని.
ఈ విషయంపై బాంద్రా పోలీసులకు పిథాని ఈమెయిల్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ”జూలై 22న సుశాంత్ సోదరి మీతూ సింగ్, ఆమె భర్త, సీనియర్ ఐపీఎస్ అధికారి ఓపి సింగ్ నుంచి నాకు కాన్ఫరెన్స్ కాల్ వచ్చింది. రియా, సుశాంత్ కలిసి ముంబయిలోని మౌంట్ బ్లాంక్లో నివాసం ఉన్న సమయంలో ఆమె ఖర్చుల గురించి నన్ను పలు ప్రశ్నలు అడిగారు. దీనికి సంబంధించి రియాకు వ్యతిరేకంగా పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వాలని వారు ఒత్తిడి చేశారు. నిజానికి చెప్పాలంటే రియాకు సంబంధించిన విషయాలపై నాకు పెద్దగా తెలియదని చెప్పినా వాళ్లు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని” పిథాని ఆరోపించారు. దీంతో సుశాంత్ కేసు మరో మలుపు తిరిగింది.
Read This Story Also: AA 21: అల్లు అర్జున్-కొరటాల.. ఫిక్స్ అయిన క్రేజీ కాంబో