కరోనా కట్టడికి ‘యాప్’తో నిఘా..!
తెలంగాణ రాష్ట్రంలో కోవిద్-19 పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటంతో.. వైరస్ సోకి చికిత్స తీసుకుంటున్న రోగులపై సర్కారు మరింత దృష్టి పెట్టింది. హోం క్వారంటైన్లో ఉన్నవారి కదలికలపై కూడా కన్నేసింది.
తెలంగాణ రాష్ట్రంలో కోవిద్-19 పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటంతో.. వైరస్ సోకి చికిత్స తీసుకుంటున్న రోగులపై సర్కారు మరింత దృష్టి పెట్టింది. హోం క్వారంటైన్లో ఉన్నవారి కదలికలపై కూడా కన్నేసింది. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 600కు చేరువైంది. యాక్టివ్ కేసులు 500 వరకు ఉన్నాయి. వీరికి హైదరాబాద్ లోని గాంధీ, కింగ్ కోఠీ, చెస్ట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
కాగా.. ఇటీవల కాలంలో కొందరు రోగులు కరోనా వార్డులో సరిగా ఉండకపోవడం, మరికొందరు ఒక అంతస్తులో ఉండాల్సింది మరో అంతస్తుకు వెళుతుండటం, ఇంకొందరు బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటంతో వాటికి చెక్ పెట్టేందుకు సర్కారు ‘కోవిడ్-19 మానిటరింగ్ సిస్టమ్ యాప్’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కరోనా రోగుల్లో 99 శాతం మందికి స్మార్ట్ ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ సాయంతో ఈ యాప్ అభివృద్ధి చేశారు. దీన్ని కరోనా రోగుల ఫోన్లలో ఇన్స్టాల్ చేశారు. దాంతో వారి ప్రతి కదలిక ఆన్లైన్ ద్వారా తెలుస్తుంది.
మరోవైపు.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి బయటకు వెళ్లాలని చూసినా, సిగ్నల్కు అందుబాటులో లేకపోయినా కూడా వెంటనే అలెర్ట్ వెళ్తుంది. దాంతో సదరు వ్యక్తి అక్కడ ఉన్నారో లేదో వైద్య సిబ్బంది పరిశీలించి, వెంటనే ఫోన్ వాడుకలోకి వచ్చేలా చేస్తారు. కరోనా వార్డుల్లోనే యాక్టివ్గా ఉన్న కొందర్ని వలంటీర్లుగా నియమించారు. మర్కజ్ యాత్రికులు 1,300 మంది, వారితో కాంటాక్టు అయి ఇళ్ల వద్ద క్వారంటైన్లో ఉన్న రెండు వేల మందికి కూడా ఈ యాప్ను ఇన్స్టాల్ చేశారు.