సీబీఐ విచారణ జరగాలి: సుశాంత్ కేసుపై సుబ్రహ్మణియన్ స్వామి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్ చేశారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ ట్వీట్ చేసిన స్వామి.. సుశాంత్ కేసు సీబీఐ విచారణకు తగినదో లేదో కనుక్కోవాలని న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు ఇష్కారణ్ సింగ్ భండారీతో చెప్పినట్లు తెలిపారు. ఇక ఈ కేసులో పోలీసుల వెర్షన్ కూడా సరైనదా..? కాదా..? అన్న కోణంలో పరిశీలన చేయాలని భండారీతో చెప్పినట్లు మరో ట్వీట్లో తెలిపారు.
కాగా గత నెల 14న ముంబయిలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొని సుశాంత్ తనువు చాలించారు. అయితే ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని ఫ్యాన్స్ నుంచి డిమాండ్ వెల్లువెత్తుతోంది. అలాగే బీజేపీ ఎంపీ రూపా గంగూలీ, రచయిత తుహిన్ సిన్హా, బీజేపీ ఎంపీ మనోజ్ తిరావీతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో సుబ్రహ్మణియన్ స్వామి సైతం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరడం గమనర్హం. ఇక దీనిపై మాట్లాడిన భండారీ.. సుశాంత్ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలతో సహా సమాచారం ఉంటే తమకు పంపాలని పేర్కొన్నారు.
మరోవైపు సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబయి పోలీసులు ఇప్పటికే 30 మందిని పైగా విచారించారు. అందులో సుశాంత్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. ఇక ట్విట్టర్ సంస్థకు కూడా పోలీసులు లేఖ రాశారు.