హాస్టల్ భోజనంలో మెలికల పాము..
ప్రస్తుతం హాస్టల్స్పై వస్తున్న ఆరోపణలు అందరినీ కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు హాస్టల్ భోజనంలో మెలికల పాము రావడం కలకలం సృష్టించింది..
హాస్టల్స్ అంటేనే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల నేపథ్యం, స్కూళ్లు, కాలేజీలు దూరంగా ఉండటంతో సమయం కలిసి వస్తుందని భావించిన పేరెంట్స్ పిల్లల్ని హాస్టల్స్లో పెడుతుంటారు. కానీ, ప్రస్తుతం హాస్టల్స్పై వస్తున్న ఆరోపణలు అందరినీ కలవరానికి గురిచేస్తున్నాయి. వసతి గృహాల్లో గతంలో కేవలం భోజనం సరిగా పెట్టరు అనే ఆరోపణలు మాత్రమే ఉండేవీ కానీ, రానురాను..అక్కడి నిర్వహణపై కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ప్రైవేటు హాస్టల్ భోజనంలో మెలికల పాము రావడం కలకలం సృష్టించింది..
తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. రాత్రి ఆదిత్య అనే వ్యక్తి తినే భోజనంలో పాము కనిపించింది.. భయాందోళనకు గురైన విద్యార్ధులు హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు కాలేజీ యాజమాన్యం.. యాజమాన్యం తీరుతో విద్యార్ధులు కాలేజి ఎదుట ఆందోళనకు దిగారు. లక్షలకు లక్షలు ఫీజులు కట్టించుకుని ఇలా నాణ్యత లేని భోజనం పెట్టటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ క్లాసులను బహిష్కరించారు. ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.