వ్యసనాలకు బానిసలై… డబ్బు కోసం అలా!
ఆ నలుగురూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన కుర్రాళ్లు. వ్యసనాలకు బానిసలై జల్సాలతో జట్టుకట్టారు. డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కారు. తాము పోలీసులమని నమ్మిస్తూ డబ్బు కోసం ఒకరిని తుపాకీతో బెదిరించారు. సోమవారం పోలీసులకు చిక్కారు. లాలాపేట పోలీసుస్టేషన్లో విలేకరులకు డీఎస్పీ నాజీముద్దీన్ వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం వీరాపురానికి చెందిన చైతన్యకృష్ణ బీటెక్ పూర్తి చేసి, విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. రొంపిచర్ల మండలం కర్లగుంట గ్రామానికి చెందిన వడ్లమూడి నాగబాబు(ఎంసీఏ), కాకుమాను మండలం కొండపాటూరుకు […]
ఆ నలుగురూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన కుర్రాళ్లు. వ్యసనాలకు బానిసలై జల్సాలతో జట్టుకట్టారు. డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కారు. తాము పోలీసులమని నమ్మిస్తూ డబ్బు కోసం ఒకరిని తుపాకీతో బెదిరించారు. సోమవారం పోలీసులకు చిక్కారు. లాలాపేట పోలీసుస్టేషన్లో విలేకరులకు డీఎస్పీ నాజీముద్దీన్ వివరాలు వెల్లడించారు.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం వీరాపురానికి చెందిన చైతన్యకృష్ణ బీటెక్ పూర్తి చేసి, విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. రొంపిచర్ల మండలం కర్లగుంట గ్రామానికి చెందిన వడ్లమూడి నాగబాబు(ఎంసీఏ), కాకుమాను మండలం కొండపాటూరుకు చెందిన పూనం మనోజ్ (బీటెక్), వినుకొండ మండలం పిట్టంబండ గ్రామానికి చెందిన మక్కెన శ్రీనివాసరావు(డిగ్రీ)… గుంటూరులోని వేర్వేరు కళాశాలల్లో చదువుతున్నారు. వీరంతా ఎస్.వి.ఎన్.కాలనీలో రూం అద్దెకు తీసుకుని ఉంటూ క్రమంగా చెడు వ్యసనాలకు అలవాటయ్యారు. చైతన్యకృష్ణ మరో స్నేహితుడైన అభిరాం దగ్గర తుపాకీ ఉంది. అతను ఇటీవల అమెరికా వెళుతూ తుపాకీని చైతన్యకృష్ణకు ఇచ్చి తన కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోరాడు. ఆ తుపాకీని చూసిన నలుగురు మిత్రులు.. బెదిరింపులకు పాల్పడి, డబ్బు సంపాదించాలని భావించారు.
చైతన్య కృష్ణ కొద్దిరోజుల కిందట రామబ్రహ్మం అనే వ్యక్తి దగ్గర కారును అద్దెకు తీసుకున్నాడు. ఈ నెల 14న రాత్రి మూడు గంటలకు నలుగురూ కలిసి కారులో బస్టాండు సెంటర్కు చేరుకున్నారు. ఆ సమయంలో మాచర్ల నుంచి గుంటూరు వస్తున్న తన స్నేహితుడి కోసం సాని మల్లికార్జున అనే వ్యక్తి బస్టాండ్కు వెళ్తున్నారు. కొత్తపేటలోని పోలేరమ్మ దేవస్థానం దగ్గర చైతన్యకృష్ణ అతని స్నేహితులు మల్లికార్జునను నిలువరించారు. తాము పోలీసులమని… అర్ధరాత్రుళ్లు రహదారులపై ఏం పని…అంటూ బెదిరించారు. మల్లికార్జునను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. కారును ముందుకు పోనిస్తూ అతనికి తుపాకీ చూపి… డబ్బు, సెల్ఫోన్ లాక్కున్నారు. అలా కారు బస్టాండు సెంటర్లోని గాయత్రి హోటల్ సెంటర్కు చేరుకుంది. అక్కడ రక్షక్ జీపులో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల్ని నిందితులు చూశారు. భయంతో కారును వదిలేసి పరారయ్యారు. ఏఎస్సై షేక్ యూనిస్బేగ్ తన సిబ్బందితో ఆ కారును పరిశీలించారు. నిందితులు వదిలి వెళ్లిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు మల్లికార్జున ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపేట సీఐ ఎస్.వి.రాజశేఖర్రెడ్డి కేసు దర్యాప్తు చేశారు. సోమవారం ఉదయం సింగ్ ఆసుపత్రి దగ్గర తిరుగాడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసును ఛేదించిన సీఐ రాజశేఖర్రెడ్డి, ఎఎస్సై ఆంథోని, హెడ్ కానిస్టేబుల్ రమేష్లను డీఎస్పీ అభినందించారు.