గోవింద నామ స్మరణతో మార్మోగిన తిరుమల కొండలు
తిరుమల నాదనీరాజనం వేదికపై సుందరకాండ పారాయణంలో భాగంగా ఉదయం శ్రీకృష్ణ జన్మాష్టమి పారాయణం జరిగింది...
తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక ఘనంగా నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించారు. తిరుమల నాదనీరాజనం వేదికపై సుందరకాండ పారాయణంలో భాగంగా ఉదయం శ్రీకృష్ణ జన్మాష్టమి పారాయణం జరిగింది. ఈ సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల కొండలు ద్వారకను తలపించాయి. తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న పారాయణ కార్యక్రమం నాటికి 125వ రోజుకు చేరుకుంది.
అనంతరం తిరుపతి ఇస్కాన్ నుంచి వచ్చిన 20 మంది భక్తులు నామ సంకీర్తన నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, డిప్యూటీ ఈవోలు హరీందర్ నాథ్, బాలాజీ, ఎస్వీ వేద ఉన్నత వేద అధ్యాయన సంస్థ ప్రత్యేకాధికారి విభీషణ శర్మ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని పాల్గొన్నారు.
అయితే తిరుమల కొండపై కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. సోషల్ డిస్టెన్స్ తప్పని సరిగా పాటిస్తున్నారు. మాస్క్ ధరించిన వారిని మాత్రమే కొండపైన దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. కొండపైకి వచ్చే భక్తులను థర్మో పరీక్షలు చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. శ్రీవారికి నిత్యకళ్యాణోత్సవాన్ని టీటీడీ లోక కళ్యాణార్ధం నిర్వహిస్తోంది. ఎంతో కనుల పండుగగా నిర్వహించే ఈ కళ్యాణం కరోనా వైరస్ కారణంగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. తిరుమల చరిత్రలో తొలిసారి ఇలా కళ్యాణం నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.