India VS ENG, 2nd ODI: లార్డ్స్ వన్డేకూ కోహ్లీ దూరం!.. నేటి మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ XI, పిచ్, వాతావరణం ఎలా ఉండనుందంటే..
India vs England: తొలి వన్డేలో ఇంగ్లండ్ను ఓడించిన టీమిండియా ఇప్పుడు లార్డ్స్లో లార్డ్ ఆఫ్ ది సిరీస్గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓవల్లో ఇంగ్లండ్ను 10 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు..
India vs England: తొలి వన్డేలో ఇంగ్లండ్ను ఓడించిన టీమిండియా ఇప్పుడు లార్డ్స్లో లార్డ్ ఆఫ్ ది సిరీస్గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓవల్లో ఇంగ్లండ్ను 10 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. సిరీస్ను కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో లార్డ్స్లో అడుగుపెట్టింది. అయితే, ఇది అంత సులభం కాదు ఎందుకంటే మొదటి వన్డేలో ఘోర పరాజయం మూటగట్టుకున్న ఇంగ్లండ్ ఎదురుదాడికి దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తొలి వన్డేలో అట్టర్ ఫ్లాప్ అయిన ఆటగాళ్లు ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నారు. ఈనేపథ్యంలో లార్డ్స్లో విజయం సాధించడం టీమిండియాకు అంతసులభమేమీకాదు. అయితే ఈ వన్డే కోసం టీమిండియా తుదికూర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీమిండియా తన ప్లేయింగ్ XIలో ఏమైనా మార్పులు చేస్తుందా? విరాట్ కోహ్లీ రెండో వన్డే ఆడతాడా ? ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఎలాంటి మార్పుల్లేకుండానే..
మీడియా కథనాల ప్రకారం విరాట్ కోహ్లీ రెండో వన్డేలో కూడా ఆడడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం అతని గాయం పూర్తిగా నయం కాలేదని, 100 శాతం ఫిట్గా ఉండకుండానే మైదానంలోకి వస్తే, అతని గాయం మరింత తీవ్రమవుతుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీని ప్రమాదంలో పడేయడం టీమిండియాకు ఇష్టం లేదని భావిస్తోంది. ఈక్రమంలో మొదటి వన్డేలో ఆడించిన జట్టుతోనే రెండో వన్డేలోనూ టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఓవల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఓవల్లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మినహా మరే ఆటగాడు బ్యాటింగ్ చేయలేకపోయాడు. రోహిత్-ధావన్ సెంచరీ భాగస్వామ్యంతో 18.3 ఓవర్లలో 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఈక్రమంలో టీమ్ ఇండియా తన విన్నింగ్ ప్లేయింగ్ XIని నిలుపుకోవాలని భావిస్తోంది.
భారత ప్రాబబుల్ ప్లేయింగ్ XI
టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్లో రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
మూడేళ్ల క్రితం ఇదే రోజు..
కాగా మూడేళ్ల క్రితం ఇదే రోజు ఇదే మైదానంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ న్యూజిలాండ్ను ఓడించి మొదటి ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈక్రమంలో తమ జట్టు ప్రపంచకప్ గెలిచిన రోజున ఇంగ్లండ్ అభిమానులు తమ స్వదేశంలో వన్డే సిరీస్ను కోల్పోకూడదని ఇంగ్లండ్ క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇంగ్లండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI
జోస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, జానీ బెయిర్స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్స్, రీస్ టోప్లే, క్రెయిగ్ ఒవర్టన్/స్యామ్ కరన్
పిచ్ ఎలా ఉందంటే..
పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామంలా కనిపిస్తోంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. మ్యాచ్కు వర్షం సమస్య లేదు. టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు.
ఎక్కడ చూడొచ్చంటే..
భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. సోనీ సిక్స్లో లైవ్ చూడొచ్చు. అదేవిధంగా జియోటీవీలోనూ వీక్షించవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..