టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం.. వీటిపైనే ప్రధాన చర్చ
తిరుమల తిరుపతి దేవస్థానం నిరర్థక ఆస్తుల విక్రయం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే ధర్మకర్తల మండలి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. లాక్డౌన్ సందర్భంగా సమావేశాన్ని తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది..? టీటీడీ భూముల అమ్మకం, దర్శనాల విషయంలో బోర్డ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. లాక్డౌన్ ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం ప్రతీ మూడు నెలలకోసారి టీటీడీ బోర్డు సమావేశం నిర్వహించాల్సి […]
తిరుమల తిరుపతి దేవస్థానం నిరర్థక ఆస్తుల విక్రయం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే ధర్మకర్తల మండలి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. లాక్డౌన్ సందర్భంగా సమావేశాన్ని తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది..? టీటీడీ భూముల అమ్మకం, దర్శనాల విషయంలో బోర్డ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
లాక్డౌన్ ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం ప్రతీ మూడు నెలలకోసారి టీటీడీ బోర్డు సమావేశం నిర్వహించాల్సి ఉంది. దీంతో ఇవాళ టీటీడీ ధర్మకర్తల మండలి భేటీ అవుతోంది. ఇతర ప్రాంతాల్లో ఉన్న బోర్డు సభ్యులు మీటింగ్కి నేరుగా హాజరుకాలేనివారు సిస్కో వెబ్ఎక్స్ యాప్ ద్వారా సమావేశాలో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ ఐటీ విభాగం పూర్తి చేసింది. టీటీడీ ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు కరుణాకర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డిలు ఈ సమావేశానికి నేరుగా హాజరవనున్నారు.
60 అంశాలతో అజెండా…
టీటీడీ బోర్డు మీటింగ్లో మొత్తం 60 అంశాలతో అజెండా రూపొందించారు. తిరుమల, తిరుపతిలో చేపట్టాల్సిన నిర్మాణ పనులు, కాంట్రాక్టుల గురించి చర్చించనున్నారు. దీంతోపాటు భూముల అమ్మకం, నగలపై ఆడిటింగ్పై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో స్వామీజీలు , భక్తుల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ఆ దిశగా బోర్డులో చర్చ జరిగే అవకాశముంది.