Shakambari festivities: ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు.. ఘనంగా అషాడమాసోత్సవాలు
Shakambari Festival: అమ్మలగన్నా అమ్మా ఆ దుర్గమ్మ. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అషాడమాసం సందర్భంగా శాకంబరి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు ఆలయ అర్చకులు. అమ్మవారి ప్రధాన ఆలయంలో పాటు ఉపాలయాలను వివిధ రకాల కూరగాయాలతో శోభాయమానంగా అలంకరించారు.. తొలుత దాతలు ఇచ్చిన నిమ్మకాయలు, కూరగాయలు వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో రుత్వికులు, పూజాధికాలు అమ్మవారికి నిర్వహించారు. 3 రోజుల పాటు శాకాంబరీదేవి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని అధికారులు తెలిపారు.
చివరి రోజున ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే పండ్లతో ప్రత్యేకంగా అలంకరిస్తామన్నారు ఆలయ ఆర్చకులు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో భ్రమరాంబ, పాలకమండలి ఛైర్మన్ సోమినాయుడి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. మూలవిరాట్ దుర్గమ్మను వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు.
శాకాంబరిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారికి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు భక్తులు. మనిషి ఆకలిని తీర్చడానికి అమ్మవారు ఉద్భవించిన అవతారమే శాకంబరి దేవిగా ప్రతీతి. ఈ దేవిని పూజించటం వల్ల క్షామం నుంచి విముక్తి లభించి, ఆకలి దరి చేరదని భక్తులు నమ్ముతారు. పోయినా ఏడాది కరోనా కారణంగా భక్తులను తక్కువ సంఖ్యలో అనుమతించారు. ఈసారి ఎలాంటి ఆంక్షలు లేకుండా.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శించుకోవచ్చన్నారు అధికారులు.