దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 72 రైళ్ల రద్దు..?
దక్షిణ మధ్య రైల్వే త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఎస్సీఆర్ పరిధిలో నడుస్తున్న 72 రైళ్లకు అధికారులు త్వరలో ఉద్వాసన పలకనున్నారు.
దక్షిణ మధ్య రైల్వే త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఎస్సీఆర్ పరిధిలో నడుస్తున్న 72 రైళ్లకు అధికారులు త్వరలో ఉద్వాసన పలకనున్నారు. ఆయా రూట్లలో నష్టాలు, ఆక్యుపెన్సీ లేకపోవడంతో రైళ్లను తొలగించాలని భావిస్తున్నారు. ఇతర రైళ్లు, గూడ్సుల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎస్సీఆర్ అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. ఈ రైళ్లన్నీ ఎస్సీఆర్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నాందేడ్, గుంతకల్లు డివిజన్లలో సుదీర్ఘకాలం సేవలందిస్తున్న పలు రైళ్లు ఉన్నట్లు సమాచారం.
రైల్వే అధికారుల కొత్త నిర్ణయంతో ఆయా రూట్లలో ఇతర ఎక్స్ప్రెస్, గూడ్స్ రైళ్ల వేగం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. చెబుతున్నారు. అంతేకాదు.. 47 ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెసులుగా మార్చనున్నారు. సబర్బన్ సర్వీసులుగా ఉన్న డెమూ, మెమూ రైళ్లను కూడా పూర్తిగా తీసివేసి.. వాటి స్థానంలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టం (ఎంఎంటీఎస్) రైళ్లను పరిచయం చేయనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో డిసెంబరు నెలలో రైళ్ల టైంటేబుల్లో భారీ ఎత్తున మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రయాణికుల గమస్థానాలకు చేరుకునే సమయాల్లో వేగం కూడా పెరుగుతుందని అధికారులు భావస్తున్నారు.
ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రతినిత్యం 876 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి సాధారణ, సూపర్ఫాస్ట్ రైళ్లు కలిపి 120, హైదరాబాద్ నుంచి 50, కాచిగూడ నుంచి 70, లింగంపల్లి నుంచి 30 రైళ్లు నడుస్తుంటాయి. ఇలా రోజుకు సగటున 1.80 లక్షల మంది ప్రయాణికులకు ఎస్సీఆర్ సేవలందిస్తుంది. వీటికి తోడు.. 128 ఎంఎంటీఎస్ సర్వీసులు, 30కి పైగా డెమూ రైళ్లు మరో 1.95 లక్షల మంది ప్రయాణికులను వారి వారి గమమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. అయితే, లాక్ డౌన్ కారణంగా రైళ్లన్నీ స్తంభించిపోయాయి. రైల్వే శాఖ నష్టాలను పూడ్చుకోవడంలో భాగంగా ఇతర రైళ్లు, ఎక్స్ప్రెస్, గూడ్స్ రైళ్ల వేగాన్ని పెంచేందుకు 72 రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించారు.
తిరుపతి-పాండిచ్చేరి, విజయవాడ-తెనాలి, తెనాలి-గుంటూరు, విజయవాడ-తెనాలి, విజయవాడ-గుంటూరు, గుంటూరు-ఒంగోలు, గుంటూరు-విజయవాడ, రాజమండ్రి-భీమవరం, భీమవరం-నిడదవోలు, మణుగూరు-కాజీపేట, ఫలక్నుమా-భువనగిరి, కలబుర్గీ జంక్షన్- హైదరాబాద్ డెక్కన్, కాజీపేట-విజయవాడ, విజయవాడ-పెద్దపల్లి, నంద్యాల హెచ్ఎక్స్ స్పెషల్, గూడూరు-రేణిగుంట జంక్షన్, డోన్-గుంతకల్, నిజామాబాద్-బోధన్, మిర్జాపల్లి-బోధన్, ఫలక్నుమా-ఉందానగర్(డెమూ), ఉందానగర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-మేడ్చల్, మేడ్చల్-ఫలక్నుమా, ఫలక్నుమా-బోరబండ, ఫలక్నుమా-మొయినాబాద్, సికింద్రాబాద్-మొయినాబాద్, హైదరాబాద్ డెక్కన్-తాండూరు, విజయవాడ-విశాఖపట్నం, బిట్రగుంట-చెన్నయ్ సెంట్రల్, తిరుపతి-నెల్లూరు తదితర రైళ్లు రద్దు కానున్నాయి
అయితే, రద్దైన రూట్లలో ప్రయాణికుల అసౌకర్యం కలగకుండా ప్రత్యేకించి ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా మనోహరాబాద్, సికింద్రాబాద్, ఉందానగర్, ఫలక్నుమా సెక్షన్ల నడుమ నడిచే డెమూ రైళ్ల స్థానంలో ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నారు.
సుమారు 47 ప్యాసింజర్ రైళ్లు ఎక్స్ప్రెస్ గా మారాయి. ఈ మేరకు వారం రోజుల క్రితం రైల్వే బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కాజీపేట-బల్లార్షా, భద్రాచలంరోడ్-సిర్పూర్టౌన్, బల్లార్షా-భద్రాచలంరోడ్, విజయపుర-బొల్లారం, హైదరాబాద్-విజయపుర, అజ్నీ-కాజీపేట, కాచిగూడ-కర్నూల్సిటీ, రాయచూరు-కాచిగూడ, గుంటూరు-కాచిగూడ, సికింద్రాబాద్-రేపల్లె, మణుగూరు-సికింద్రాబాద్, హైదరాబాద్-పర్బనీ, కాచిగూడ-నాగర్సోల్ రైళ్లు, వాటి పెయిర్స్ను ఎక్స్ప్రెసులుగా మార్చనున్నారు.
ఇకపై ఇవి సూపర్ఫాస్ట్ ట్రైనులుగా దూసుకుపోతాయి. అందుకు అనుగుణంగా ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్ బోగీలు, థర్డ్ ఏసీ కోచ్లను ఏర్పాటు చేస్తున్నారు. రైళ్ల మధ్య వేగం పెరగడం వల్ల ప్రయాణికులకు సమయభావం కలిసి వస్తుందని అధికారులు చెబుతున్నారు.