మాజీ ఎమ్మెల్యే భార్యకు తప్పని సైబర్ వేధింపులు
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రముఖుల కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడుతున్నారు. తాజగా హైదరాబాద్లో ఓ మాజీ ఎమ్మెల్యే ...
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రముఖుల కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడుతున్నారు. తాజగా హైదరాబాద్లో ఓ మాజీ ఎమ్మెల్యే భార్యను వేధింపులకు గురిచేశారు కొందరు కేటుగాళ్లు. దీంతో వారు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో నివసిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే భార్య పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేశారు కొందరు కేటుగాళ్లు. సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఐడీతో పలువురికి పోస్టులు పెట్టారు. ప్రొఫైల్ పిక్గా ఆమె ఫొటోనే వినియోగించారు. ఈ ఐడీ ద్వారా ఆమే స్వయంగా పోస్టులు పెట్టినట్లు అభ్యంతరకరంగా, అసభ్యంగా కొన్ని మెసేజ్లు పోస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఆమె స్నేహితులు, బంధువులకు వెళ్లాయి. కొందరితో ఆమె మాదిరిగా చాటింగ్ కూడా చేస్తున్నారు. ఈ విషయం ఆమె దృష్టికి రావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.