ప్రపంచ అద్భుతం అభనేరి మెట్ల బావి!
పాపిష్టి కరోనా వైరస్ పర్యాటకరంగపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది.. సంతోషంగా ఓ వేడుకనో, ఉత్సవాన్నో జరుపుకునే వీల్లేకుండా చేసిందా పాడు వైరస్! అసలు ఎవరిలోనూ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలన్న ఉత్సాహమే కనిపించడం లేదు..
పాపిష్టి కరోనా వైరస్ పర్యాటకరంగపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది.. సంతోషంగా ఓ వేడుకనో, ఉత్సవాన్నో జరుపుకునే వీల్లేకుండా చేసిందా పాడు వైరస్! అసలు ఎవరిలోనూ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలన్న ఉత్సాహమే కనిపించడం లేదు.. కరోనా లేకపోయి ఉంటే ఇవాళ రాజస్థాన్లోని అభనేరి టూరిస్టులతో కిటకిటలాడుతూ ఉండేది.. అక్కడున్న 13 అంతస్తుల బావి దగ్గర ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి.. రాజస్తానీ సంప్రదాయ నృత్యగీతికలు, తోలుబొమ్మలాటలు, ఒంటెలపై విహారాలు చాలా వినోద కార్యక్రమాలు ఉండేవి.. కరోనా కారణంగా అభనేరి ఫెస్టివల్ ఎలాగూ క్యాన్సల్ అయ్యింది.. సందర్భం వచ్చింది కాబట్టి అసలు అభనేరి ప్రత్యేకత ఏమిటో ఓసారి పరికిద్దాం..రాజస్థానలోని అభనేరి అనే గ్రామంలో ఉన్న మెట్ల బావికి ఓ ప్రత్యేకత ఉంది.. దేశంలో అద్భుత కట్టడాలలో ఇది కూడా ఒకటి. ఏకంగా 13 అంతస్తులు ఉంటుందీ బావి.. 3,500 మెట్లతో, 30 మీటర్ల లోతుతో ప్రపంచంలోనే అతి పెద్ద బావిగా ప్రఖ్యాతిగాంచింది.. ఎనిమిదో శతాబ్దంలో నికుంభ వంశానికి చెందిన చంద అనే రాజు కట్టించాడీ బావిని. అందుకే దీన్ని చాంద్ వవోరి అంటారు.. ఈ బావి దగ్గర టెంపరేచర్లు చాలా తక్కువగా ఉంటాయి.. చుట్టుపక్కల ఉష్ణోగ్రతలతో పోలిస్తే కనీసం అయిదారు డిగ్రీల తక్కువగా ఉంటుంది.. అందుకే ఈ బావికి ఒక పక్క ఉన్న గదుల్లో ఆనాటి రాజులు విశ్రాంతి తీసుకునేవారు. ఏడాది పొడవునా ఈ బావిలో నీళ్లు ఉంటాయి.. ఇప్పటివరకు ఎండిపోయింది లేదు.. ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు వేసవి కాలంలో వేడికి తట్టుకోలేక చల్లదనం కోసం ఆ బావి దగ్గరకొస్తారు. వేసవి కాలంలో అడుగున కనిపించే నీళ్లు, వర్షాకాలం వస్తే పై వరకు వస్తాయి. ఈ బావిలోకి దిగడానికి మూడువైపులా మెట్లు ఉన్నాయి. నాలుగో వైపు అందమైన మంటపాలు ఉన్నాయి. బావి సమీపంలోనే హర్షత్ మాత ఆలయం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు బావిలోని నీటితో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకున్నాకే ఆలయంలోకి వెళతారు. ఇక్కడ వెలసిన అమ్మవారు ఊరంతటికీ తేజస్సును అందిస్తుందనేది ప్రజల నమ్మకం. అందుకే ఊరి పేరు అభానగరిగా ప్రసిద్ధి పొందింది.. రానురాను అదే అభనేరిగా మారింది..