కార్తీక మాసం..తొలి సోమవారం

శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీకం..అందులోనూ సోమవారం అంటే శివుడికి ఎంతో ఇష్టం. ప్రతి యేటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్ధశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు విశేషంగా […]

కార్తీక మాసం..తొలి సోమవారం
Follow us

|

Updated on: Oct 28, 2019 | 4:39 PM

శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీకం..అందులోనూ సోమవారం అంటే శివుడికి ఎంతో ఇష్టం. ప్రతి యేటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్ధశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు విశేషంగా పూజలు చేస్తుంటారు. కార్తీకమాసం వచ్చిందంటే ఆ నెల రోజులూ పండుగదినాలే. దేశ నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు.

ఇక, కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. భ్రమరాంబ మళ్లికార్జున స్వామివారి సాధారణ దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనం టోకన్లు తీసుకున్న భక్తులు క్యూలో మూడు గంటలు వేచి చూడాల్సి వస్తోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగటలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటున్నారు. అలాగే నాగులకట్ట దగ్గర మహిళలు కార్తీక నోములు నోచుకున్నారు. కాళేశ్వరం, వేములవాడ ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. ఇక, పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, పాలకొల్లు, భృమవరం, సామర్లకోట, అమరావతి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పంచారామాలను ఒకే రోజు దర్శనం చేసుకుంటే జ్యోతిర్లాంగాలను దర్శించిన ఫలితం దక్కుతుందని నమ్ముతారు. పశ్చమగోదావరి జిల్లా జుత్తిగ ఉమావాసుకిరవి సోమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే నత్తారామేశ్వరం శ్రీరామేవ్వరస్వామీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా యానాంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్బంగా శ్రీ రాజరాజేశ్వర  స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అలాగే అన్నవరం రమా సత్యనారాయణ స్వామి సన్నిధిలో తెల్లవారుజాము నుంచే కార్తీక దీపాలు వెలిగించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ వ్రతాల కోసం భక్తులు బారులు తీరారు.