కసబ్ను గుర్తుపట్టిన దేవిక పరిస్థితి ఇప్పుడెలా ఉంది?
దేవిక ఎవరో చాలా మందికి తెలియకపోవచ్చు....తెలిసిన కొద్ది మందికీ ఆమె ఠక్కున స్ఫురణకు రాకపోవచ్చు...గుర్తుకు తెచ్చుకునేంత సెలెబ్రెటీ కాదామె! పదకొండేళ్ల కిందట మాత్రం ఆమె ధైర్యానికి ప్రతీక! సాహసపు గీతిక! ఆమె ఎవరో ..
దేవిక ఎవరో చాలా మందికి తెలియకపోవచ్చు….తెలిసిన కొద్ది మందికీ ఆమె ఠక్కున స్ఫురణకు రాకపోవచ్చు…గుర్తుకు తెచ్చుకునేంత సెలెబ్రెటీ కాదామె! పదకొండేళ్ల కిందట మాత్రం ఆమె ధైర్యానికి ప్రతీక! సాహసపు గీతిక! ఆమె ఎవరో .. ఆమె తెగువ ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఓ పుష్కరకాలం వెనక్కి వెళ్లాలి.. అది 2008, నవంబర్ 26.. ముంబాయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్…పాకిస్తాన్ నుంచి దొంగదారిలో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కసబ్, అతడి సహచరులు జరిపిన కాల్పులలో 58 మంది చనిపోయారు.బులెట్ దెబ్బ తిని కూడా అదృష్టవశాత్తూ బతికిన ఒకే ఒక ప్రత్యక్ష సాక్షి దేవిక. 2009, జూన్ నెల.. ముంబాయి మీద ఉగ్రవాదులు తెగబడిన ఘటన జరిగి ఏడు నెలలయ్యింది.. ఆ ఘాతుకానికి తలపడిన వారిలో ఒకడైన కసబ్ ముంబాయి సెంట్రల్లోని ఆర్ధర్ జైలులో ఉన్నాడు.. తండ్రి వెంట వచ్చిన తొమ్మిదేళ్ల దేవికను అక్కడికి తీసుకొచ్చారు. ఆమె కుడికాలికి ఆపరేషన్ జరిగి అరు నెలలవుతుంది. ఆ కసబ్ పేల్చిన తుపాకీ బులెట్టే ఆ చిన్నారి కాలిలోకి దూసుకెళ్లింది.. అందుకే ఆపరేషన్ అవసరమయ్యింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని దేవిక చేతి కర్రల సాయంతో నడుస్తూ వచ్చింది.. జైలులో ఏర్పాటు చేసిన కోర్టులో న్యాయమూర్తి కూర్చొని ఉన్నారు.. కసబ్తో పాటు మరో ఇద్దరు ఓ మూలన ఉన్నారు.. దేవికను బోన్లోకి రప్పించారు.. భగవద్గీతను ఆమె చేతికి వచ్చి ప్రమాణం చేయించారు. ఈ ముగ్గురిలో నిన్ను తుపాకితో కాల్చింది ఎవరో గుర్తుపట్టగలవా ? అని న్యాయమూర్తి అడిగారు.. ముగ్గురిని జాగ్రత్తగా చూసిన దేవిక… కసబ్వైపు వేలెత్తి చూపింది.. అంతే.. ఒక్కసారిగా దేవిక వార్తల్లో వ్యక్తిగా మారింది.. న్యూస్ పేపర్లలో దేవిక పతాకశీర్షిక అయ్యింది.. ముంబాయి వాసుల ప్రశంసలు అందుకుంది ఆ చిన్నారు.. ఆ చిన్నారి తెగువను అందరూ మెచ్చుకున్నారు.. ఇది జరిగి పదకొండేళ్లవుతుంది.. అప్పుడు దేవిక కుటుంబం ఎలా ఉండిందో.. ఇప్పుడూ అలాగే ఉంది.. అదే పశ్చిమ బాంద్రాలోని మురికివాడలో నివాసం.. అదే పేదరికం.. అదే బెదిరింపుల జీవితం.. దేవిక చేసిన సాహసానికి ఆమెకు వీసమెత్తు ప్రయోజనం కూడా కలగలేదు.. ఇవన్నీ ఆలోచించే దేవిక తండ్రి నట్వర్లాల్ తన కూతురును కోర్టుకు పంపనన్నారు.. ప్రభుత్వం ఆదుకుంటుందని, సాయం చేస్తుందని, రక్షణ కల్పిస్తుందని ఇంకా చాలా చాలా చెప్పి లాయర్ ఎలాగోలా నట్వర్ను ఒప్పించారు.. దేవిక సాక్ష్యమైతే చెప్పింది కానీ.. ప్రభుత్వమే చెప్పింది చేయలేకపోయింది.. ఇప్పటికీ నట్వర్లాల్ కూలీపనికి వెళుతుంటారు.. భార్య కాలం చేసి చాలా కాలమయ్యింది.. పెద్దకొడుకు భరతేమో పూణెలో ఉంటాడు.. చిన్నకొడుకు జయేషేమో తండ్రితో ఉంటాడు.. అందరికంటే చిన్నది దేవిక.. ఉగ్రవాదుల దాడి జరిగిన రాత్రి దేవిక ఛత్రపతి శివాజీ టెర్మినస్కు ఎందుకు ఉందంటే తన అన్న భరత్ను చూడ్డానికి పూణెకు వెళ్లాలని…! అప్పుడే ఉగ్రవాదులు దాడికి దిగారు.. జయేష్ బాత్రూమ్ ఉంటే, నట్వర్లాల్, దేవిక ఫ్లాట్ఫామ్ మీద ఉన్నారు.. కసబ్ పేల్చిన తూపాకీ నుంచి బులెట్ దూసుకొచ్చి దేవిక కాలిలో దిగింది.. ఆ దెబ్బకు దేవిక స్పృహతప్పింది.. కళ్లు తెరిచేసరికి ఆసుపత్రిలో ఉంది.. కసబ్ను గుర్తు పట్టిన తర్వాత దేవిక జీవితమే మారిపోయింది.. ఆమెను చేర్చుకోవడానికి ఏ స్కూలూ ముందుకు రాలేదు.. కారణం భయం! ఉగ్రవాదులు పగపట్టి స్కూల్ను ఏమైనా చేస్తారేమోనన్న భయం! బంధువులు కూడా వీళ్లను దూరం పెట్టారు.. కారణం అదే భయం! ఇప్పటికీ అప్పుడప్పుడు బెదిరింపులు ఫోన్లు వస్తుంటాయి.. అవి ఆకతాయిల నుంచో ఉగ్రవాదుల నుంచో తెలియదు కానీ వస్తూ ఉంటాయి.. ఇప్పుడు దేవిక డిగ్రీ చదువుతోంది.. సమయం దొరికినప్పుడల్లా కాలేజీ నుంచి ఇంటికొచ్చేటప్పుడు ఛత్రపతి శివాజీ టెర్మినస్కు వెళుతుంటుంది.. తనకు గాయమైన చోట కాసేపు నిలబడి వస్తుంటుంది.. కసబ్ను గుర్తిపట్టిన దేవికకు ఒరిగిందేమీ లేదు.. అదే చిన్న గదిలో జీవితం.. అన్నలిద్దరిదీ రోజూవారి సంపాదనే! పని దొరికితేనే డబ్బులు.. లేదా పస్తులు.. రెండు రోజుల కిందట దేవిక ఇంటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్బాబా సిద్ధిక్ వెళ్లారు.. తనకు చేతనైనంత ఆర్ధిక సాయం చేశాడు.. దేవిక కుటుంబానికి ఓ ఇల్లును .. దాంతో పాటే కాసింత భద్రతను కల్పించమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను అభ్యర్థించారు.. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మాట నిలుపుకుంటుందా? దేవిక కుటుంబాన్ని ఆదుకుంటుందా..? కసబ్ కీ బేటి అంటూ దెప్పి పొడవడమే తప్ప ఆమెను భరతమాత ముద్దుబిడ్డగా చూడలేమా? కాసేపు అందరూ కంగనా రనౌత్ విషయాన్ని పక్కన పెట్టి దేవికపై శ్రద్ధ చూపిస్తే బాగుంటుందేమో.