Covaxin: ఏడు రాష్ట్రాల్లో మొదలుకానున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం… ఎప్పటి నుంచి టీకా అందించనున్నారంటే..?
దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం కలిపి 27 రాష్ట్రాల పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. జనవరి 23 ఒక్క రోజులోనే....
భారత్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల మందికిపైగా భారతీయులు టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో జనవరి 16న వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు ఎంత మంది టీకా తీసుకున్నారంటే..?
దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం కలిపి 27 రాష్ట్రాల పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. జనవరి 23 ఒక్క రోజులోనే దేశంలోని 1,46,598 మందికి కరోనా వ్యాక్సిన్స్ అందించినట్లు కేంద్రం తెలిపింది. అయితే నిన్న టీకా తీసుకున్నవారిలో 123 మందికి ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తాయని, ఎటువంటి మరణాలు సంభవించలేదని ఆరోగ్య శాఖ పేర్కొంది. కానీ 11 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ వివరించింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి టీకా తీసుకున్నవారిలో ఆరుగురు చనిపోయారని, అయితే వారిలో ఎవరూ కూడా కోవిడ్ కారణంగా మృతి చెందలేదని ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ తెలిపారు.
మరో ఏడు రాష్ట్రాల్లో…
భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ను వారం రోజుల వ్యవధిలో ఏడు రాష్ట్రాల్లోని ప్రజలకు అందించనున్నారు. పంజాబ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, కేరళ, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వచ్చే వారంలో టీకాను సరఫరా చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.