ఆరోపణలు చేసిన వాలంటీర్పై 100కోట్ల పరువు నష్టం దావా వేయనున్న సీరమ్ ఇనిస్టిట్యూట్
కరోనాకు వ్యాక్సిన్ వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. మూడోదశ క్లినికల్ ట్రయల్స్ కీలక దశకు చేరుకున్నాయి
Serum Institute volunteer : కరోనాకు వ్యాక్సిన్ వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. మూడోదశ క్లినికల్ ట్రయల్స్ కీలక దశకు చేరుకున్నాయి. ఈ దశలో వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ సీరమ్ ఇనిస్టిట్యూట్కి, నోటీసులు పంపాడు. ఆ వ్యాక్సిన్ వల్లే తాను అనారోగ్యానికి గురైనట్లు ఆరోపించాడు.
చెన్నైకి చెందిన 40ఏళ్ల వ్యక్తి ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే తనకు నాడీ సంబంధమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. వెంటనే క్లినికల్ ట్రయల్స్ ఆపివేసి తనకు రూ.5కోట్ల పరిహారం ఇవ్వాలని సీరమ్ ఇన్స్టిట్యూట్కు నోటీసులు పంపించాడు. ఇక ఈ ఆరోపణలపై సీరమ్ ఘాటుగా స్పందించింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
నోటీసులోని అంశాలు తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని సీరమ్ తెలిపింది. వ్యాక్సిన్ ప్రయోగానికి, వాలంటీర్ ఆరోగ్య సమస్యకు ఎలాంటి సంబంధం లేదని ఓ ప్రకటనలో తెలిపింది. కేవలం ఆయన ఆరోగ్య సమస్యలను వ్యాక్సిన్ ప్రయోగాలకు ఆపాదిస్తూ నిందలు వేస్తున్నాడని చెప్పింది. డబ్బు డిమాండ్ చేసే ఉద్దేశంతోనే ఇలాంటి దుష్ర్పచారానికి పాల్పడినట్లు మండిపడింది. ఇలాంటి అసత్య ప్రచారం చేయడం తగదని, వాలంటీర్పై వంద కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని కోరుతామని హెచ్చరించింది.
ఇదిలా ఉంటే ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధిచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ ప్రయోగాలు చివరి దశకు చేరాయి. మరో రెండు వారాల్లోనే అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సీరం ఇన్స్టిట్యూట్ చీఫ్ అధర్ పూనావాలా చెప్పారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీ, ప్రయోగ వివరాలను తెలుసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం శనివారం సీరం ఇన్స్టిట్యూట్ను సందర్శించారు.
ఇక రేపోమాపో వ్యాక్సిన్ విడుదల అవుతుందని ఆశిస్తున్న టైమ్లో వాలంటీర్ ఆరోపణలు సంచలనంగా మారాయి. అయితే సీరమ్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అనుకున్న టైమ్లో అనుకున్నట్లు వైరస్ విడుదల చేస్తామని ప్రకటించింది.