బుల్ జోరు.. 39,000 మార్క్ దాటేసిన సెన్సెక్స్
దేశీ స్టాక్ మార్కెట్ ఈ వారంలో వరుసగా రెండో రోజూ లాభాలతోనే ముగిసింది. ప్రధానంగా ప్రయివేట్ బ్యాంకులు, ఫార్మా దిగ్గజాలకు డిమాండ్ నెలకొనడంతో దేశీ స్టాక్ మార్కెట్లు గరిష్టాల వద్దే నిలవగలిగాయి.
దేశీ స్టాక్ మార్కెట్ ఈ వారంలో వరుసగా రెండో రోజూ లాభాలతోనే ముగిసింది. ప్రధానంగా ప్రయివేట్ బ్యాంకులు, ఫార్మా దిగ్గజాలకు డిమాండ్ నెలకొనడంతో దేశీ స్టాక్ మార్కెట్లు గరిష్టాల వద్దే నిలవగలిగాయి. దీంతో సెన్సెక్స్ 39,000 పాయింట్ల మైలురాయిని దాటేసింది. కాగా.. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 11,500ను అధిగమించింది. నేటి ట్రేడింగ్లోనూ ఎప్పటిలాగే ఆటుపోట్లు కనిపించినప్పటికీ చివరికి సెన్సెక్స్ 288 పాయింట్లు లాభపడి 39,044 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 82 పాయింట్లు ఎగబాకి 11,522 వద్ద నిలిచింది. అయితే, ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,754 దిగువన కనిష్టాన్ని చవిచూడగా.. నిఫ్టీ ఒక దశలో 11,442 వరకూ నీరసించింది.
ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఫార్మా, ప్రయివేట్ బ్యాంక్స్ 2 శాతం పుంజుకోగా.. ఐటీ 0.6 శాతం లాభపడింది. రియల్టీ, మీడియా 0.7-0.4 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, సిప్లా, యూపీఎల్, యాక్సిస్, ఎయిర్టెల్, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, కొటక్ మహీంద్రా, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఆర్ఐఎల్ 5-1 శాతం మధ్య ఎగిసిపడ్డాయి. అయితే, టైటన్, మారుతీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్, ఐటీసీ, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఐవోసీ, హెచ్సీఎల్ టెక్ 1.4-0.4 శాతం మధ్య చతికిలాపడ్డాయి.
డెరివేటివ్ కౌంటర్లలో మదర్సన్, అశోక్ లేలాండ్, లుపిన్, ఐడీఎఫ్సీ ఫస్ట్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, అరబిందో, నౌకరీ, అంబుజా సిమెంట్, ఐజీఎల్, శ్రీరామ్ ట్రాన్స్, మైండ్ట్రీ, అమరరాజా, కమిన్స్, గోద్రెజ్సీపీ 4-2.4 శాతం మధ్య జంప్చేశాయి. మరోవైపు పీవీఆర్, నాల్కో, ఐబీ హౌసింగ్, బీఈఎల్, మారికో, పేజ్, ఎస్కార్ట్స్, అదానీ ఎంటర్, పీఎన్బీ 3.5-01 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-1.5 శాతం చొప్పున పెరిగాయి. ట్రేడైన షేర్లలో 1,582 లాభపడగా.. 1,164 నష్టాలతో ముగిశాయి. ఇక, నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 298 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 120 కోట్ల అమ్మకాలు చేపట్టాయి.