కరోనాపై మరో షాకింగ్ న్యూస్: గతేడాది నవంబర్లోనే దేశంలోకి వైరస్..! అది భిన్నమైంది
కరోనా పుట్టిన చైనాలోని వుహాన్ సిటీ నుంచి తిరిగి వచ్చిన మెడికల్ విద్యార్థి.. భారత్ లో తొలి కరోనా పాజిటివ్ పేషెంట్ గా ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఇక్కడే మరో కొత్త విషయం బయటపెట్టారు భారత శాస్త్రవేత్తలు. దేశంలో కరోనా వైరస్ జనవరి 30కి ముందే అడుగుపెట్టినట్లు హైదరాబాద్లోని సీసీఎంబీ శాస్త్రవేత్తలు..
చైనాలోని వుహాన్ నగరంలో గత ఏడాది డిసెంబరులో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 63 లక్షల మందికి పైగా సోకింది. దాదాపు 3.7 లక్షల మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. అయితే, దేశంలో తొలి కరోనా పాజిటివ్ కేసు ఈ ఏడాది జనవరి 30న కేరళలో నమోదైంది. కరోనా పుట్టిన చైనాలోని వుహాన్ సిటీ నుంచి తిరిగి వచ్చిన మెడికల్ విద్యార్థి.. భారత్ లో తొలి కరోనా పాజిటివ్ పేషెంట్ గా ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఇక్కడే మరో కొత్త విషయం బయటపెట్టారు భారత శాస్త్రవేత్తలు. దేశంలో కరోనా వైరస్ జనవరి 30కి ముందే అడుగుపెట్టినట్లు హైదరాబాద్లోని సీసీఎంబీ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కనిపిస్తున్న వైరస్ స్ట్రెయిన్ మూలాలు..గతేడాది నవంబర్ 26 నుంచి డిసెంబర్ 25 మధ్యలోనివిగా పరిశోధకులు గుర్తించారు. కేరళలో గుర్తించిన కరోనా వైరస్కు వుహాన్ మూలాలు ఉండగా.. హైదరాబాద్లో గుర్తించిన వైరస్ భిన్నమైందిగా తేల్చారు. ఇక్కడ గుర్తించిన వైరస్కు ఆగ్నేయాసియా మూలాలు ఉన్నాయని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కే మిశ్రా తెలిపారు. కరోనా వైరస్ అనేక రకాలుగా రూపాంతరం చెందగా.. హైదరాబాద్కు చెందిన సీసీఎంబీ పరిశోధకులతో పాటు ఇతర శాస్త్రవేత్తలు మోస్ట్ రీసెంట్ కామన్ ఆన్సెస్టర్ వయసును గణించారు.
ఇప్పటికే తెలిసిన స్ట్రెయిన్తో పోలిస్తే.. కొత్తది, భిన్నమైందని వారు గుర్తించారు. దీనికి క్లేడ్ I/A3i అని నామకరణం చేశారు. దీనికి సంబంధించి పూర్విక వైరస్ మనదేశంలో జనవరి 17 నుంచి ఫిబ్రవరి 25 మధ్యకాలంలో నుంచే వ్యాప్తిలోకి వచ్చిందని..తెలంగాణతో పాటు అత్యధిక కేసులతో ముందు వరుసలో ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో ఈ రకం ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే, నవంబర్, డిసెంబర్ నెలల్లో దేశంలో కోవిడ్ టెస్టులు చేయకపోవటంతో ఈ వైరస్ ప్రయాణికుల నుంచి దేశంలోకి ప్రవేశించిందా..లేదా అనే విషయంలో స్పష్టత రాలేదని చెబుతున్నారు.