Delhi Schools: ఢిల్లీలో 18 నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు.. ఆ తరగతి విద్యార్థులకు మాత్రమే అనుమతి
Delhi Schools:కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూత పడ్డాయి. అన్లాక్ ప్రక్రియలో భాగంగా అన్ని రంగాలు తెరుచుకున్నప్పటికీ, విద్యాసంస్థలు...
Delhi Schools: కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూత పడ్డాయి. అన్లాక్ ప్రక్రియలో భాగంగా అన్ని రంగాలు తెరుచుకున్నప్పటికీ, విద్యాసంస్థలు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. ఆన్లైన్ క్లాసుల ద్వారానే విద్యార్థులకు బోధన కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాలు విద్యాసంస్థలు తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 18వ తేదీ నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. 10,12 తరగతుల విద్యార్థులకు తరగతులు కొనసాగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
రాబోయే బోర్డు పరీక్షలు, ప్రీబోర్డ్ పరీక్షలు, ప్రాక్టికల్ వర్క్ సన్నాహకాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సుమారు తొమ్మిది నెలల తర్వాత 10,12 తరగతుల విద్యార్థులు పాఠశాలల బాట పట్టనున్నారు. ఈనెల 18 నుంచి విద్యాసంస్థలకు అనుమతి ఇచ్చిన ఢిల్లీ సర్కార్.. విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి, అవసరమైన కరోనా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు పిలవాలని ఆయా విద్యాసంస్థలను కోరింది. విద్యార్థుల విషయంలో ఎలాంటి బలవంతం చేయరాదని సూచించింది. విద్యార్థుల హాజరుపై పాఠశాలలు రికార్డులు మెయింటన్ చేయాలని తెలిపింది. పాఠశాలలు తెరుచుకున్నాక కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించింది. శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.