ఉన్నావ్ కేసులన్నీ ఢిల్లీకి బదిలీ.. బాధితురాలికి రూ . 25 లక్షల పరిహారం.. సుప్రీం..
ఉన్నావ్ రేప్ కేసులనన్నిటినీ సుప్రీంకోర్టు ఢిల్లీకి బదిలీ చేసింది. (ఇవి మొత్తం 5 కేసులు). ఈ కేసులో బాధితురాలికి రేపటిలోగా రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ కేసుల విచారణ 45 రోజుల్లోగా పూర్తి కావాలని డెడ్ లైన్ విధించింది. కేసుల విచారణ రోజువారీగా జరగాలా అన్న విషయాన్ని కోర్టు రేపు నిర్ధారించనుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితురాలికి సంబంధించి దర్యాప్తును 7 రోజుల్లోగా […]
ఉన్నావ్ రేప్ కేసులనన్నిటినీ సుప్రీంకోర్టు ఢిల్లీకి బదిలీ చేసింది. (ఇవి మొత్తం 5 కేసులు). ఈ కేసులో బాధితురాలికి రేపటిలోగా రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ కేసుల విచారణ 45 రోజుల్లోగా పూర్తి కావాలని డెడ్ లైన్ విధించింది. కేసుల విచారణ రోజువారీగా జరగాలా అన్న విషయాన్ని కోర్టు రేపు నిర్ధారించనుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితురాలికి సంబంధించి దర్యాప్తును 7 రోజుల్లోగా పూర్తి చేయాలని కోర్టు మొదట సీబీఐని ఆదేశించినప్పటికీ.. ఆ తరువాత ఈ గడువును మరో 7 రోజులకు పొడిగించింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించాలని కూడా న్యాయమూర్తులు ఆదేశించారు. దీంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించనున్నట్టు తెలుస్తోంది. పార్టీనుంచి బహిష్కృతుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ సూచనలతోనే బాధితురాలి కారు యాక్సిడెంట్ జరిగినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్ ను కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ కేసు స్టేటస్ పై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బాధితురాలి కుటుంబానికి సి ఆర్ పీ ఎఫ్ భద్రత కల్పించాలని కోర్టు సూచించింది.
అటు-బాధితురాలి కుటుంబం కోర్టుకు రాసిన లేఖ ఆలస్యంగా అందిన వైనంపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 30 వరకు ఈ లేఖ ‘ పిల్ ‘ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) సెక్షన్ లో టేబుల్ మీదే ఎందుకు ఉందని ఆయన కోర్టు సెక్రటరీ జనరల్ ను ప్రశ్నించారు. ఇందుకు సెక్రటరీ జనరల్… ఈ నెలలో తమకు 6,800 లెటర్ పిటిషన్లు అందాయని, ఆ పిటిషన్లలో ఈ లేఖ కూడా చేరిపోయిందని చెప్పారు. తమకు బాధితురాలి పేరు గానీ, ఆ కుటుంబం గురించి గానీ తెలియదని, అయితే తెలిశాక దీన్ని కోర్టు ముందు ఉంచామని ఆయన వివరించారు.
సెంగార్ నుంచి తమ కుటుంబానికి పెను హాని పొంచి ఉందని బాధితురాలి ఫ్యామిలీ లేఖ రాసిన విషయం విదితమే. ఈ లేఖ గురించి తనకు దినపత్రికల ద్వారానే తెలిసిందని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించిన విషయం గమనార్హం.