అసలు బాలాకోట్ పై దాడి జరిగిందా..? ప్రశ్నలను లేవనెత్తుతున్న సాటిలైట్ చిత్రం
పాకిస్థాన్లోని బాలాకోట్లో ఉన్న ఉగ్ర స్థావరాలను భూస్థాపితం చేశామని భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఉగ్ర స్థావరాలకు ఎటువంటి నష్టం జరగలేదని కొన్ని వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. బాలాకోట్లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ఓ మదరసాను నడుపుతున్నది. ఆ మదరసాలోనే జిహాదీలు శిక్షణ పొందుతున్నారు. అయితే ఆ మదరసాకు ఎటువంటి నష్టం జరగలేదని తాజాగా ఓ శాటిలైట్ ఇమేజ్ను రిలీజ్ చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్లానెట్ ల్యాబ్స్ సంస్థ ఈ హై రెజల్యూషన్ శాటిలైట్ […]
పాకిస్థాన్లోని బాలాకోట్లో ఉన్న ఉగ్ర స్థావరాలను భూస్థాపితం చేశామని భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఉగ్ర స్థావరాలకు ఎటువంటి నష్టం జరగలేదని కొన్ని వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. బాలాకోట్లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ఓ మదరసాను నడుపుతున్నది. ఆ మదరసాలోనే జిహాదీలు శిక్షణ పొందుతున్నారు. అయితే ఆ మదరసాకు ఎటువంటి నష్టం జరగలేదని తాజాగా ఓ శాటిలైట్ ఇమేజ్ను రిలీజ్ చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్లానెట్ ల్యాబ్స్ సంస్థ ఈ హై రెజల్యూషన్ శాటిలైట్ చిత్రాన్ని రిలీజ్ చేసింది. ఈ ఫోటోలో ఉన్న మదరసా బిల్డింగ్కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆ బిల్డింగ్ చుట్టు ఉన్న మరో ఆరు బిల్డింగ్లు కూడా చెక్కుచెదరకుండా ఉన్నట్లు మార్చి 4వ తేదీన తీసిన శాటిలైట్ ఫోటో ద్వార తెలుస్తోంది. గత ఏడాది 2018 ఏప్రిల్లో తీసిన శాటిలైట్ ఫోటో.. ఇప్పుడు తీసిన ఫోటోలో ఎటువంటి మార్పు లేదని ప్లానెట్ ల్యాబ్స్ వెల్లడించింది. మదరసాపై వైమానిక దాడి జరిగినట్లు ఆధారలు లేవని స్పష్టం చేసింది. బిల్డింగ్ కూలినట్లు కానీ,చెల్లాచెదురైనట్లు కానీ, గోడలు పగిలినట్లు కానీ, చెట్లు విరిగినట్లు కానీ ఆనవాళ్లు లేవని పేర్కొన్నది. కాగా దీనిపై భారత విదేశాంగ శాఖ ఇంకా తన స్పందన వెల్లడించలేదు.
లక్ష్యం తప్పిందా..?
మిడిల్బరీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడియోస్ తూర్పు ఆసియా నాన్ ప్రోలైఫరేషన్ ప్రాజెక్ట్ డైరక్టర్ జెఫ్రి లివిస్ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాటిలైట్ చిత్రాలపై పరిశోధనలు జరపడంపై జెఫ్రి లివిస్ కు పదిహేనేళ్ల అనుభవముంది. ఉపగ్రహాలనుంచి వచ్చిన చిత్రాలను పరిశీలించిన జెఫ్రి లివిస్ ఆ చిత్రాలలో బాలాకోట్ లోని స్థావరాలు చెక్కుచెదరలేదని వెల్లడించారు. అంతే కాదు గతేడాది ఫోటోలకు ఈ సారి తీసిన ఫోటోల మధ్య ఏలాంటి మార్పులేదని తేల్చిచెప్పారు. ఉపగ్రహం పంపించిన మూడు చిత్రాలను క్షుణ్ఱంగా పరిశీలించిన అనంతరం దాడి జరగలేదని తేల్చిచెప్పినట్లు జెఫ్రి లివిస్ వెల్లడించారు.
కాగా భారత ప్రభుత్వం 12 మిరాజ్ విమానాల ద్వారా 1000కిలోల బాంబులను జారవిడిచినట్లు పేర్కొంది. అయితే ఆ బాంబులు నిజంగా లక్ష్యాన్ని చేధించి ఉంటే.. అక్కడ ఉన్న భవనాలు ఎందుకు అలానే ఉన్నాయన్న అనుమానాలను లేవనెత్తారు. శాటిలైట్ చిత్రాలలో కనిపిస్తున్న భవనాల సమీపంలో కనీసం దాడి జరిగినట్లు కూడా లేదని అన్నారు. నిజంగా అంతపెద్ద మొత్తంలో బాంబులను వాడితే అక్కడ ఉన్న భవనాలు నేలమట్టం కావాలని అన్నారు. కానీ అవన్నీ శాటిలైట్ ఫోటోలో అలానే ఉండటం చూస్తే.. భారత్ బాంబులను వేరే కొండ ప్రాంతాల్లో వదిలిందా అన్న అనుమానాలు వస్తున్నట్లు లివిస్ తో పాటు మరో సీనియర్ రీసెర్చర్ డేవ్ అన్నారు. కాగా పాకిస్థాన్ విమానాలు భారత విమానాలను వెంబడించడంతో భారత్ కొండ ప్రాంతాల్లో బాంబులను వదిలివెళ్లిందని.. ఈ దాడిలో పలు చెట్లు విరిగిపోయాయని పాకిస్థాన్ అధికారులు తెలిపారు. భారత్ జరిపిన వైమానిక దాడిలో పాకిస్థాన్ కు ఏలాంటి ప్రాణనష్టం జరగలేదని.. పాకిస్థాన్ ఆర్మీ మేజర్ ఆసిఫ్ గఫూర్ వెల్లడించారు.
బాంబులు విసిరిన ప్రాంతం..
బాలాకోట్ ప్రాంతంలో దాడి జరిగిందన్న ప్రదేశంలో పలువురు జర్నలిస్టులు రెండు పర్యాయాలు పర్యటించారు. అయితే ఇక్కడ స్థానిక ప్రజలను అడగ్గా.. ఇక్కడ ఫిబ్రవరి 26న పెళ్లుల్లు జరిగాయని వెల్లడించారు. అయితే తెల్లవారుజామున జాబా ప్రాంతంలో ఈ శబ్ధం వచ్చినట్లు తెలిసిందని అన్నారు. అంతేకాదు జాబా ప్రాంతంలో కొన్ని దేవదారు వృక్షాలు నేలకొరిగినట్లు తెలిపారు. దాడి జరిగిన ప్రాంతంలో ఏలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని స్థానికులు కూడా తెలిపినట్లు ఆ జర్నలిస్టులు చేపట్టిన సర్వేలో వెల్లడైంది.
అయితే మే నెలలో భారత్ లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పుడి ఉండవచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్న విషయంతో సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీ లబ్ధి పొందాలన్న ఆశతో ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చన్న వాదన వెలువడుతుంది. ఈ నేపథ్యంలోనే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాలాకోట్ లో ఎక్కడ దాడి జరిపారు అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాదు దాడి జరిగిన సాక్ష్యాలను చూపించాలని.. ఉగ్రదాడిలో ఎందరు ఉగ్రవాదులు హతమయ్యారో స్పష్టం చెయ్యాలని ప్రశ్నించారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి దీనిపై ఇప్పటివరకు సరైన సమాధానం రాకపోవడంతో.. అసలు బాలాకోట్ ఉగ్రస్థావరాలపై దాడులు జరిగాయా.. లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.