పండగ కష్టాలు.. ‘ప్రైవేట్’ ట్రావెల్స్ బాదుడు.. భారంగా మారుతోన్న ‘సంక్రాంతి’ జర్నీ.!
Sankranti Festival Rush: పండగ సీజన్ వచ్చిందంటే చాలు.. ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా వ్యవరిస్తుంటాయి. రద్దీని క్యాష్ చేసుకోవాలనుకునే..
Sankranti Festival Rush: పండగ సీజన్ వచ్చిందంటే చాలు.. ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా వ్యవరిస్తుంటాయి. రద్దీని క్యాష్ చేసుకోవాలనుకునే క్రమంలో టికెట్ రేట్లను భారీగా పెంచేస్తూ ప్రయాణీకులకు చుక్కలు చూపిస్తాయి. ఇక ఎప్పటిలానే ఈ సంక్రాంతి సీజన్కు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు దోపిడీకి తెగబడ్డారు. డిమాండ్ ఉన్న తేదీల్లో అయితే టికెట్ రేట్లను డబుల్ చేసి మరీ ప్రయాణీకుల జేబులు చిల్లు పడేలా చేస్తున్నారు.
సాధారణంగా హైదరాబాద్(Hyderabad) నుంచి రాజమండ్రి(Rajamundry)కి ఆర్టీసీ బస్సు టికెట్ ధర రూ. 900 కాగా.. ప్రైవేట్ ట్రావెల్స్ సుమారు రూ. 1500 వసూలు చేస్తున్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి గుంటూరు(Guntur) మార్గంలో నాన్ ఏసీ బస్సు సర్వీసులకు రూ. 418 కాగా.. స్పెషల్ బస్సుల్లో రూ. 568గా ఉంది. అయితే ప్రైవేట్ బస్సుల్లో టికెట్ ధరలు రూ.850–రూ.950 వరకు ఉన్నాయి.
ఇలా ఇష్టానుసారంగా రేట్లు పెంచేస్తూ ప్రయాణీకులను దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్, ఆన్లైన్ టికెట్ బుకింగ్ సైట్లపై ఏపీ(Andhra Pradesh) రవాణాశాఖ అధికారులు డేగ కన్ను వేశారు. ప్రయాణీకులను ఇబ్బంది పెట్టేలా టికెట్ ధరలను పెంచితే ఊరుకునేది లేదని రవాణా శాఖ అదనపు కమిషనర్ ప్రసాదరావు హెచ్చరించారు. అధిక రేట్లకు టికెట్లను విక్రయిస్తే.. ట్రావెల్ నిర్వాహకులతో పాటు బస్ టికెట్ కంపెనీలపై కూడా మోటారు వెహికల్ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేయనున్నారు.
కాగా, సంక్రాంతి పండుగ సీజన్ మొదలైన దృష్ట్యా ఇవాళ్టి నుంచి రాష్ట్ర సరిహద్దుల్లో ప్రైవేట్ బస్సులను తనిఖీలు చేసేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలను రవాణా శాఖ ఏర్పాటు చేసింది. రూల్స్ను అతిక్రమిస్తే ట్రావెల్స్ నిర్వాకులకు రూ. 25 వేల భారీ జరిమానాను విధించనున్నారు. కేసుల నమోదు విషయంలో ఇతర రాష్ట్రాల బస్సులకు సైతం మినహాయింపు లేదని రవాణా శాఖ అధికారులు తేల్చి చెప్పారు.
Also Read: ఫ్యాన్స్కు సోనూసూద్ రిక్వెస్ట్.. ”నాపై ప్రేమను చూపేందుకు మీరు బాధను భరించకండి” అంటూ ట్వీట్..