సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండ ముస్తాబు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండను ముస్తాబు చేస్తున్నారు. ఏడుకొండలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన గోపురంతోపాటు ఇతర ఆలయాలకు మెరుగులు దిద్దారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండను ముస్తాబు చేస్తున్నారు. ఏడుకొండలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన గోపురంతోపాటు ఇతర ఆలయాలకు మెరుగులు దిద్దారు. మాడవీధులలో శోభాయమానంగా రంగవల్లులు వేయించారు. టీటీడీ గార్డెనింగ్ విభాగం ఆధ్వర్యంలో వివిధ పుష్పాలతో ఆలయ ప్రాకారాలను అలంకరిస్తున్నారు. విద్యుద్దీపాల వెలుగులో తిరుగిరి కాంతులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేశారు. ఘాట్రోడ్కు మరమ్మతులు చేసి పిట్టగోడలకు రంగులు వేస్తున్నారు. మరోవైపు, తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి కలిశారు. ముఖ్యమంత్రికి ప్రసాదాలు అందజేసి, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరై సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు. టీటీడీ ఛైర్మన్ వెంట కార్యనిర్వాహక అధికారి(ఈవో) అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో ఏవీ ధర్మారెడ్డి కూడా ఉన్నారు.