ఎస్వీబీసీ నూతన ఛైర్మన్..
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు సాయికృష్ణ ఆ పదవిలో కొనసాగనున్నారు.
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC ) నూతన ఛైర్మన్ను నియమించింది ప్రభుత్వం. నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు సాయికృష్ణ ఆ పదవిలో కొనసాగనున్నారు.
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపుమేరకు సాయికృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల నుంచి ఆయన కుటుంబం వైసీపీ కు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో సాయికృష్ణను ఎస్వీబీసీ ఛైర్మన్గా ప్రభుత్వం నియమించింది.
గతంలో ఎస్వీబీసీ ఛైర్మన్గా ఉన్న సినీనటుడు పృథ్వీరాజ్ ఆ పదవికి రాజీనామా చేశారు. మహిళా ఉద్యోగితో అనుచితంగా ప్రవర్తించారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పృథ్వీ రాజీనామా చేయాల్సి వచ్చింది.