బీజేపీ నేతలతో సచిన్ పైలట్ మంతనాలు ! వ్యూహం ఫలించేనా ?
రాజస్తాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఢిల్లీలో బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. తనకు 19 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన చెప్పుకుంటున్నారు. అయితే ఆయనకు రాజస్తాన్ ముఖ్యమంత్రి పదవిని..
రాజస్తాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఢిల్లీలో బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. తనకు 19 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన చెప్పుకుంటున్నారు. అయితే ఆయనకు రాజస్తాన్ ముఖ్యమంత్రి పదవిని మాత్రం కట్టబెట్టేందుకు కమలనాథులు సిధ్ధంగా లేరని, ఇదంతా మీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని చెబుతున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో.. పైలట్ కూడా ‘సన్నాయి నొక్కులు’ నొక్కుతున్నట్టు సమాచారం. నేను మీ పార్టీలో చేరబోనని ఆయన స్పష్టం చేశారట. సచిన్ పైలట్ సొంతంగా ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయవచ్ఛునని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. కాగా- రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి కుట్ర పన్నారని ఆరోపిస్తూ.. తనకు ‘స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ‘ సమన్లు జారీ చేయడం పట్ల సచిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సన్నిహితులు కూడా.. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి లేదా ఉప ముఖ్యమంత్రికి ఇలా సమన్లు పంపడం ఎన్నడూ జరగలేదని మండిపడుతున్నారు. ఈ విషయంలో పార్టీ హైకమాండ్ ఎందుకు జోక్యం చేసుకోవడంలేదని వారు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు-రాజస్తాన్ చీఫ్ విప్ మహేష్ జోషీ తనకు కూడా సమన్లు పంపారని, వారికి తాను కూడా సహకరిస్తానని సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఆయన పేర్కొన్నారు.