ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.5 కోట్లు సీజ్
అక్రమార్కుల పాపాల పుట్టలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గత కొద్ది కాలంగా అక్రమార్జనతో కోట్లకు పడిగలేత్తిన అధికారుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు
అక్రమార్కుల పాపాల పుట్టలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గత కొద్ది కాలంగా అక్రమార్జనతో కోట్లకు పడిగలేత్తిన అధికారుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు రెవిన్యూ అధికారులు ఏసీబీ వలకు చిక్కగా.. తాజాగా ఓ పోలీసు ఉన్నతాధికారి దొరికిపోయాడు. ఏకంగా ఐదు కోట్లకు పైగా అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డి నివాసంలో ఏసీబీ అధికారలుు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు రూ. 5 కోట్ల ఆస్తులు గుర్తించామని అవినీతి నిరోధక శాఖ అధికారి తెలిపారు. హైదరాబాద్లోని మహేంద్రహిల్స్ నివాసంతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్తో పాటు అనంతపురంలో మొత్తం 25 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ. 5 కోట్ల ఆస్తులు గుర్తించామని స్పష్టం చేశారు. ఇంకా బ్యాంకు లాకర్లు చూడాల్సి ఉందన్నారు. హైదరాబాద్లో 3 ఇళ్లు, 5 ఇంటి స్థలాలను గుర్తించామని పేర్కొన్నారు. నరసింహారెడ్డి బంధువులు, ఆయన బినామీల ఇళ్లలోనూ సోదాల జరిపామని వాటి సమాచారం రావాల్సి ఉందన్నారు. ఈ లెక్కన్న మొత్తం స్వాధీనం విలువ మరింత పెరిగే అవకాశముందన్నారు. అయితే నర్సింహారెడ్డితో ప్రజాప్రతినిధుల లింకులు ఇంకా బయటపడలేదు.. విచారిస్తున్నామని రవీందర్ రెడ్డి తెలిపారు.
మహేంద్రహిల్స్ నివాసంలో జరిపిన దాడుల్లో భారీగా బంగారు, వెండి ఆభరణాలను అధికారులు గుర్తించారు. 2008 నుంచి 2010 వరకు మియాపూర్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో నరసింహారెడ్డి పలు భూవివాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో భారగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారలు తేల్చారు. అంతేకాకుండా ఉప్పల్, మల్కాజ్గిరిల్లోనూ భూవివాదాల్లో ఏసీపీ తలదూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీగా ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారలు నర్సింహారెడ్డితో పాటు ఆయన బినామీల ఇళ్లల్లోనూ ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అయితే, ప్రముఖుల రాజకీయ నాయకులతోనూ నర్సింహారెడ్డికి లింకులు ఉన్నట్లు భావిస్తున్న ఏసీబీ అధికారులు.. ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తామన్నారు.