ఆర్టీసీ, రవాణాపై కేసీఆర్ క్లారిటీ !
హైదరాబాద్ సహా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని కేసీఆర్ చెప్పారు.
మే 15 వరకు రాష్ట్రంలో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం కావని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 15న మరోసారి సమీక్షించి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు, క్యాబ్లు, ఆటోలకు గ్రీన్ జోన్లలో అనుమతి ఉందన్నారు. పాసులు తీసుకొని ప్రజలు, కార్మికులు ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చని చెప్పారు. అత్యవసరం అయితే 100కు ఫోన్ చేస్తే పాసులు జారీ చేస్తారన్నారు.
హైదరాబాద్ సహా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని కేసీఆర్ చెప్పారు. ఈ ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఏ మాత్రం సడలింపులు ఇచ్చినా వాహనాలు వేలాదిగా రోడ్డుపైకి వచ్చేస్తాయని,.. దాన్ని అదుపు చేయడం కష్టమని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు భౌతిక దూరం పాటించడం సాధ్యం కాదని అన్నారు. ఆర్టీసీ అంశం మే 15న మరోసారి జరిగే సమీక్షా సమావేశంలో చర్చకు వస్తుందని చెప్పారు. అప్పటి పరిస్థితులు, కరోనా కేసుల ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. హైదరాబాద్లో సడలింపులపైనా అప్పుడే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక వీటితో పాటుగా, వివాహానికి 20 మంది, అంత్యక్రియలకు 10మందిని అనుమతిస్తామని సీఎం చెప్పారు.