మొరాయిస్తున్న మెట్రో.. రీజన్ ఏంటి..?
భాగ్యనగరంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మెట్రోకి రెండేళ్లు కూడా గడవ లేదు.. కానీ అప్పుడే మొరాయిస్తున్నాయి. ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. తరచూ ఏదో ఓ కారణం చేత నిలిచిపోతూ.. ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా మంగళవారం జరిగిన ఘటన.. అందర్నీ షాక్కు గురిచేస్తోంది. అసలు మెట్రో ఎక్కాలా.. వద్దా అన్న ఆలోచనలో పడేస్తోంది. మంగళవారం సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో.. నాగోల్ నుంచి హైటెక్ సిటీకి బయలుదేరిన ఓ ట్రైన్లో బేగంపేట సమీపంలోకి వచ్చేసరికి.. పెద్ద […]
భాగ్యనగరంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మెట్రోకి రెండేళ్లు కూడా గడవ లేదు.. కానీ అప్పుడే మొరాయిస్తున్నాయి. ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. తరచూ ఏదో ఓ కారణం చేత నిలిచిపోతూ.. ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా మంగళవారం జరిగిన ఘటన.. అందర్నీ షాక్కు గురిచేస్తోంది. అసలు మెట్రో ఎక్కాలా.. వద్దా అన్న ఆలోచనలో పడేస్తోంది. మంగళవారం సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో.. నాగోల్ నుంచి హైటెక్ సిటీకి బయలుదేరిన ఓ ట్రైన్లో బేగంపేట సమీపంలోకి వచ్చేసరికి.. పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్ధాన్ని విన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శబ్దం వచ్చిన వెంటనే ఆ ట్రైన్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దాదాపు అరగంట పాటు ట్రైన్ అక్కడే నిలిచిపోయింది. ఎంతకూ ముందుకు వెళ్లకపోవడంతో.. చివరకు ఎమర్జెన్సీ ఎక్సిట్ ద్వారా ప్రయాణికులు బయటకి వచ్చేశారు. పట్టాల మీదుగా అమీర్ పేట స్టేషన్కు వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సుమారు గంట తరువాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.ఆ తర్వాత రైళ్ల రాకపోకలు తిరిగి మొదలయ్యాయి.
అయితే అసలు ఆ ట్రైన్ ఎందుకు ఆగిపోయిందన్న దానిపై అనుమానాలు తలెత్తడంతో.. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. ఎలక్ట్రికల్ లైన్ నుంచి విద్యుత్ తీసుకునే పరికరం.. మెట్రో రైలుకు పైన ఉండే తీగల్లో ఇరుక్కుపోవడం వల్ల ఈ అంతరాయం కల్గిందని తెలిపారు. అయితే అందులో ఉన్న ప్రయాణికులు భారీ శబ్దం వచ్చిందంటూ ఆరోపిస్తున్నారు. దీంతో అసలు ఈ మెట్రో ఎంత సురక్షితంగా ఉంది అన్న దానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా, గతంలో కూడా పలుమార్లు ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తాయి. మొన్నటి వర్షాకాలంలో అమీర్ పేట సమీపంలో ఫ్లెక్సీ ఎగిరి మెట్రో విద్యుత్ పిల్లర్లపై పడటంతో.. మెట్రో సర్వీసులు నిలిపివేశారు. అంతకు ముందు ఓ సారి విద్యుత్ సమస్య తలెత్తిందంటూ కొద్ది గంటల పాటు సర్వీసులను ఆపివేశారు. ఇలా తరచుగా సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు సాంకేతిక సమస్యలు తలెత్తుకుండా అధిగమించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ముఖ్యంగా ఎంతో కీలకమైన అమీర్పేట మెట్రో స్టేషన్ సమీపంలోనే ఈ ఘటనలు జరగడం ఆందోళనలకు గురిచేస్తోంది. అకస్మాత్తుగా ఆగిపోతున్న మెట్రో రైళ్లతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.