త్వరలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ షురూ..
తెలంగాణ రైతులకు ఎరువుల కొరత తీర్చే ప్రతిష్టాత్మక రామగుండం ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభం కానుంది. కిషాన్ బ్రాండ్ పేరుతో రామంగుడం ఎరువుల కర్మాగారం యూరియా ఉత్పత్తిని తయారు చేయనుంది. ప్రత్యక్షంగా 460 మంది, పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి లభించనుంది.
తెలంగాణ రైతులకు ఎరువుల కొరత తీర్చే ప్రతిష్టాత్మక రామగుండం ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభం కానుంది. నవంబర్ 15 నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారంపై అధికారులతో కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కిషాన్ బ్రాండ్ పేరుతో రామంగుడం ఎరువుల కర్మాగారం యూరియా ఉత్పత్తిని తయారు చేయనుంది. ప్రత్యక్షంగా 460 మంది, పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి లభించనుంది. ఉత్పత్తిలో 50 శాతం ఎరువులు తెలంగాణ రైతులకే దక్కనున్నాయి.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన యూరియా సగం రాష్ట్రంలోనే పంపిణీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 10లక్షల టన్నుల ఎరువుల అవసరం ఉంది. ఇప్పటి వరకు యూరియాను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో తెలంగాణ రైతులకు ఎరువుల కొరత తీరనుంది. రూ.6,120.55 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ కర్మాగారంలో రోజువారీగా 2200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కానుంది.
గతంలో మూతపడిన కర్మాగారం స్థానంలోనే గ్యాస్ ఆధారిత అమ్మోనియా, యూరియా ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్), ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్సీఐల్)తో జాయింట్ వెంచర్గా ఈ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీని చేపట్టారు. ఈ ప్లాంటుకు అవసరమైన సహజ వాయువును ప్రతిపాదిత మల్లవరం-భిల్వారా పైప్లైన్ ద్వారా, నీటి వనరులను గోదావరి నది పై నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ నుండి అందిస్తారు
రామగుండం ఎఫ్సీఐ 1999 ఏప్రిల్ ఒకటిన మూతపడింది. 1980లో ఉత్పత్తి ప్రారంభించిన ఈ కర్మాగారం ఆదినుంచే అనేక అవరోధాలను ఎదుర్కొంటూ 18 సంవత్సరాలు నడిచింది. రోజుకు 1500 టన్నుల యూరియా ఉత్పత్తి సామర్థ్యమున్న ఈ యూనిట్ బొగ్గుకొరత, నష్టాలభారం, కార్మిక సమస్యల కారణంగా మూతపడింది. ప్రారంభ సమయంలో 3వేల టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంగా ప్రారంభమైంది. అయితే కేవలం 750 టన్నుల ఉత్పత్తి మాత్రమే చేయగలిగింది.
ఆసియాలోనే ప్రయోగాత్మకంగా బొగ్గు ఆధారంగా ఎరువులు తయారు చేసే ఈ కర్మాగారాన్ని బొగ్గు కొరత, కరెంటు కోతలతో 1992లో బీఐఎఫ్ఆర్ ఖాయిలా పరిశ్రమగా ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం దానికి సాంకేతికతను అందించి గ్యాస్ ఆధారిత ఫ్యాక్టరీగా పునరుద్ధరించాలని నిర్ణయించింది. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్’ పేరుతో కంపెనీని ప్రారంభించేందుకు జరిగిన ఒప్పందం పై కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లు సంతకాలు చేశారు.
బొగ్గు గనులతోపాటు వెలుగులు నింపే ఎన్టీపీసీవంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉండడంతో రామగుండానికి మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరు వచ్చింది. 1999లో రామగుండంలోని ఎరువుల కర్మాగారం మూతపడి నందున, ఈ ఎరువుల కర్మాగారాన్ని మళ్లీ పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించి, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, స్థానిక ఎంపీల నిరంతర కృషితో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములుగా రామగుండం ఆర్ఎఫ్సీఎల్ పునఃనిర్మాణానికి అడుగులుపడ్డాయి. మూతపడ్డ 20 ఏళ్ళ తర్వాత ‘రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ స్థానంలో కొత్తగా ‘రామగుండం ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్’ పేరును 17 ఫిబ్రవరి 2015న నామకరణం చేసి 2016లో కొత్త యూనిట్ నిర్మాణ పనులు చేపట్టారు.
గ్యాస్ సరఫరా చేసేందుకుగాను ఏపీలోని కుంచనపల్లి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 360 కిలోమీటర్ల మేర గ్యాస్ పైపులైన్లు వేశారు. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్, భూపాలపల్లి జిల్లాల మీదుగా కరీంనగర్ జిల్లాలోని రామగుండం వరకు ఈ గ్యాస్ పైపులైన్ ను నిర్మించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మీదుగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి, ఏన్కూరు, కామేపల్లి, ముల్కనూరు ప్రాంతాల మీదుగా మహబూబాబాద్ జిల్లా తీగెలవేణి, వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం వరకు గ్యాస్ పైపులైన్లు వేశారు.
గ్యాస్ సరఫరాలో ఏదైనా అంతరాయం గానీ, ప్రమాదాలు గానీ జరిగినప్పుడు నియంత్రించేందుకు ఏపీ, తెలంగాణలో 15 చోట్ల ఎస్వీ స్టేషన్ల (గ్యాస్ నియంత్రణ ప్రదేశాలు) నిర్మించారు. ఇందులో ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని నాచారం, కామేపల్లి మండలంలోని లింగాల వద్ద దగ్గర రెండు ఎస్వీ స్టేషన్ల నిర్మించారు.