30 కోట్ల ఆఫర్ని తిరస్కరించిన రామ్..!
కరోనా నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి ఇంకా కష్టాలు వీడటం లేదు. షూటింగ్లకు అనుమతి ఇచ్చినప్పటికీ.. రోజురోజుకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో సెట్స్ మీదకు వెళ్లేందుకు ఎవ్వరూ సాహసించడం లేదు.
కరోనా నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి ఇంకా కష్టాలు వీడటం లేదు. షూటింగ్లకు అనుమతి ఇచ్చినప్పటికీ.. రోజురోజుకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో సెట్స్ మీదకు వెళ్లేందుకు ఎవ్వరూ సాహసించడం లేదు. ఇక ఇప్పటికే షూటింగ్ని పూర్తి చేసుకున్న సినిమాల పరిస్థితి మరోలా ఉంది. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేకపోవడంతో.. చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఈ నేపథ్యంలో పలు భాషల్లోని చాలా మూవీలు ఆన్లైన్లో ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చాయి. అయితే కొన్ని చిత్రాలు మాత్రం ఆన్లైన్లో వచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. ఆ లిస్ట్లో రామ్ నటించిన రెడ్ ఒకటి.
తమిళంలో విజయం సాధించిన తాడమ్ రీమేక్గా రెడ్ తెరకెక్కింది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు అందరిని ఆకట్టుకోగా, సినిమాపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. అన్నీ కుదిరి ఉంటే ఏప్రిల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ కరోనా రావడంతో ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని ఆన్లైన్లో విడుదల చేసేందుకు పలు ఓటీటీ ఫ్లాట్ఫామ్లు మేకర్లను సంప్రదించాయట. అంతేకాదు 30 కోట్ల భారీ ఆఫర్ని కూడా ఇచ్చాయట. అయితే ఈ ఆఫర్ని రామ్ టీమ్ తిరస్కరించిందట. నిదానం అయినా థియేటర్లలోనే ఈ చిత్రాన్ని తీసుకురావాలని వారు ఆలోచిస్తున్నారట. కాగా రెడ్ బాటలో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన కూడా ఉన్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.