మొత్తానికి ఆ దర్శకుడిని ఓకే చేసుకున్న చెర్రీ.. కానీ..!
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్లో నటిస్తోన్న రామ్ చరణ్, తన తదుపరి మూవీని ఇంతవరకు ప్రకటించలేదు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్లో నటిస్తోన్న రామ్ చరణ్, తన తదుపరి మూవీని ఇంతవరకు ప్రకటించలేదు. చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఆచార్యలో నటిస్తున్నప్పటికీ.. అది కేవలం అతిథి పాత్ర మాత్రమే. ఈ నేపథ్యంలో చెర్రీ తదుపరి చిత్రం ఎవరితో ఉంటుందన్న ఆతృత ఫ్యాన్స్లో పెరుగుతోంది. మరోవైపు ఇప్పటికే పలువురు దర్శకులు చెర్రీకి కథలు వినిపించినప్పటికీ.. వారందరినీ హోల్డ్లోనే పెట్టినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం తన తదుపరి చిత్రం కోసం వంశీ పైడిపల్లిని చెర్రీ ఫైనల్ చేసుకున్నట్లు ఫిలింనగర్లో వర్గాల ద్వారా తెలుస్తోంది.
అయితే మహేష్ కోసం ముందుగా కథను రాసుకున్న వంశీ, దాంతో అతడిని పెద్దగా మెప్పించలేకపోయారు. దీంతో వంశీ, చెర్రీకి మరో కథను వినిపించారని, అది అతడికి బాగా నచ్చడంతో ఓకే చెప్పాడని సమాచారం. ఇక ఈ సినిమాను దిల్ రాజు గానీ, చెర్రీ గానీ నిర్మించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సెట్స్ మీదకు వెళ్లేందుకు ఏ నటుడు సాహసించడం లేదు. ఈ నేపథ్యంలో చెర్రీ ఆర్ఆర్ఆర్ని పూర్తి చేసుకొని.. వంశీతో సెట్స్ మీదకు వెళ్లేందుకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా వంశీ ఇదివరకు చెర్రీతో ఎవడు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.