వంద పెట్టు.. మార్కులు కొట్టు.. లంచాల హెడ్ మాస్టర్ సలహా!
ఉత్తర ప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ (యుపిఎస్ఇబి) పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ప్రారంభమయ్యాయి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే సమాధాన పత్రంలో వంద రూపాయాల నోటు ఉంచాలని
ఉత్తర ప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ (యుపిఎస్ఇబి) పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ప్రారంభమయ్యాయి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే సమాధాన పత్రంలో వంద రూపాయాల నోటు ఉంచాలని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు సలహా ఇచ్చాడు. వివరాల్లోకెళితే…. యూపీలో సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు పరీక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మాస్ కాపీయింగ్ను నిరోధించేందుకు అక్కడి యోగీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటోంది.
కాగా.. ఉత్తర ప్రదేశ్ రాజధాని లఖ్నవూకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మవు జిల్లాలో ప్రవీణ్ మాల్ అనే ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పరీక్షల సన్నద్ధతకు సంబంధించి సమావేశం నిర్వహించాడు. సమావేశంలో ఆయన విద్యార్థులకు పరీక్షల్లో ఏ విధంగా మోసం చేయాలో వారి తల్లిదండ్రుల సమక్షంలోనే వివరించడం గమనార్హం. ”నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మా విద్యార్థులు ఒక్కరు కూడా పరీక్షల్లో ఫెయిల్ అవ్వరు. వారు భయపడేంతగా అక్కడేంలేదు. మీలో మీరు మాట్లాడుకుంటూ పరీక్ష రాయండి. ఎవ్వరి చేతిని తాకకండి. మీలో మీరు మాట్లాడుకుంటే ఏం కాదు. పరీక్షా కేంద్రంలోని ఉపాధ్యాయులంతా నా స్నేహితులే.
జనంలో కొంతమంది అతనితో స్పందిస్తూ: “సాహి హై (ఇది బాగుంది)”. అని అన్నారు. ఒక వేళ కాపీ కొడుతూ మీరు పట్టుబడి, మిమ్మల్ని ఒకటి, రెండు చెంప దెబ్బలు కొట్టినా భయపడకండి. వాటిని భరించండి. ఏ సమాధాన పత్రాన్ని వదిలిపెట్టకండి. అందులో వంద రూపాయల నోటు ఉంచండి. అంతే మీ పేపరు దిద్దే ఉపాధ్యాయులు గుడ్డిగా మీకు మార్కులు వేస్తారు. ఒక వేళ సరైన సమాధానం రాయకపోయినా, నాలుగు మార్కుల ప్రశ్నకు, మూడు మార్కులు ఇస్తారు” అంటూ జై హింద్, జై భారత్ అనే నినాదాలతో తన ప్రసంగాన్ని ముగించారు.
అయితే ఓ విద్యార్థి తన మొబైల్తో ఈ తతంగాన్ని వీడియోని తీసి దాన్ని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గ్రీవెన్స్ పోర్టల్లో పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు సదరు ప్రధానోపాధ్యాయుణ్ని అరెస్టు చేశారు.