ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు ఉపాధ్యాయులు..!
లిక్కర్ మాఫియాపై నిఘా పెట్టేందుకు టీచర్లను వాడుకున్న పంజాబ్ ప్రభుత్వం.. తాజాగా ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు 40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను రంగంలోకి దింపింది.
ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు బడి పంతుళ్లకు పని చెబుతోంది పంజాబ్ ప్రభుత్వం. ఇది వరకు లిక్కర్ మాఫియాపై నిఘా పెట్టేందుకు టీచర్లను వాడుకున్న పంజాబ్ ప్రభుత్వం.. తాజాగా ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు 40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను రంగంలోకి దింపింది. కపుర్తాలా జిల్లాలోని ఫగ్వారాలోని చెక్ పోస్టుల వద్ద వారికి డ్యూటీలను అప్పగిస్తూ ఆ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున ఒంటి గంట వరకు టీచర్లు విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీచర్లతో పాటు పోలీసులు కూడా విధులు నిర్వహించనున్నారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్ ప్రభుత్వం నెల క్రితం మద్యం మాఫియాపై నిఘా పెట్టేందుకు 24 మంది టీచర్లకు బాధ్యతలు అప్పగించింది. అయితే, ఉపాధ్యాయులను బోధనేతర కార్యకలాపాల్లో వినియోగించుకోవడం పట్ల ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకులను ఇలా ఇష్టమొచ్చినట్లు వాడుకోవడం సరికాదని మండిపడుతున్నారు. ఈ ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు