లాక్డౌన్ మరింత పొడిగించే అవకాశంః మంత్రి మల్లాడి
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. పోలీస్ శాఖ కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ గడువు పొడిగిస్తారనే...
కోవిడ్-19 ప్రాణాంతక మహమ్మారి కోరలు చాస్తోంది. చాపకింద నీరులా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వచ్చే నెల 14 వరకు లాక్డౌన్ విధించారు ప్రధాని నరేంద్రమోదీ. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పటిష్ట చర్యలు అమలు చేస్తున్నారు ఇరువురు ముఖ్యమంత్రులు. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. పోలీస్ శాఖ కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసింది. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాలను సీజ్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ గడువు పొడిగిస్తారనే వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు పరిశీలించగా…
దేశప్రజలంతా ఖచ్చితంగా లాక్డౌన్ పాటించాలని సూచించారు పుద్దచ్చేరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు. కరోనా నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చేపడుతున్న చర్యలను ఆయన అభినందించారు. ఈ సందర్భందా ఆయన కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు.
కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి యానాంలో లక్ష మందికి మాస్క్లు, సబ్బులు పంపిణీ చేస్తున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు. యానాంలో ఉన్న 22 రేషన్షాపులు, ఐదు కోపరేటివ్ లిక్కర్ షాపులను మూసివేశామని తెలిపారు. ప్రజలకు రేషన్తో పాటు నిత్యావసరాలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తే ఆ సరుకులను హోల్సేల్ ధరలకే హోం డెలివరీ చేస్తామని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం ఏప్రిల్ 14 వరకే ఉన్న లాక్డౌన్ను కేంద్రం కొన్ని రోజులు పొడిగించే అవకాశముందని మంత్రి మల్లాడి కృష్ణారావు అభిప్రాయం వ్యక్తం చేశారు.