తమిళనాట కరోనా కల్లోలం….సర్కార్ కీలక నిర్ణయం..జులై 31 వరకు
తమిళనాడులో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన తమిళనాడులో.. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తమిళనాడులో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన తమిళనాడులో.. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలు మరిన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 15 వరకు ప్రజా, ప్రైవేటు రవాణాపై ఉన్న నిషేధాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ… తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ప్రస్తుత లాక్డౌన్ చివరి రోజు వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. అయితే, క్యాబులు, ఆటోలకు మాత్రం అనుమతిచ్చింది. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోందని తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో సర్కార్ పేర్కొంది. ఇందులో భాగంగా జులై 31 వరకు ప్రజా, ప్రైవేటు రవాణా కార్యకలాపాలను నిషేధించినట్టు తెలిపింది. వైరస్ను నియంత్రించడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాల్సిందిగా కోరింది.
మరోవైపు, సోమవారం ఒక్కరోజే తమిళనాడులో కొత్తగా 4,328 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 66 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకున్న 3,035 మంది ఇవాళ డిశ్చార్జి అయ్యారు. తమిళనాడులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,798కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 48,196 కాగా, ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 92,567. మరణాల సంఖ్య 2,032కు చేరినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రకటించింది.