అమెరికా ‘ఆగమాగం’.. వైట్ హౌస్ వద్దే రేగిన ‘కాక’ !
నల్లజాతీయుడి దారుణ హత్యకు నిరసనగా అమెరికా వరుసగా ఆరో రోజున కూడా ఘర్షణలు, అల్లర్లతో అట్టుడికింది. నిరసనకారులు పెద్ద సంఖ్యలో ఏకంగా అధ్యక్ష భవనం వైట్ హౌస్ నే టార్గెట్ చేశారు...
నల్లజాతీయుడి దారుణ హత్యకు నిరసనగా అమెరికా వరుసగా ఆరో రోజున కూడా ఘర్షణలు, అల్లర్లతో అట్టుడికింది. నిరసనకారులు పెద్ద సంఖ్యలో ఏకంగా అధ్యక్ష భవనం వైట్ హౌస్ నే టార్గెట్ చేశారు. అక్కడి బ్యారికేడ్లను, చరిత్రాత్మక సెయింట్ జాన్స్ చర్చిని తగులబెట్టారు. రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. వీరి దాడుల్లో 50 మందికి పైగా సీక్రెట్ సర్వీసు ఏజంట్లు గాయపడ్డారు. అమెరికా జాతీయ పతాకాలను ఆందోళనకారులు దగ్ధం చేశారు. పోలీసులు బాష్ప వాయువు, పెప్పర్ స్ప్రే ప్రయోగించినా వారు బెదరలేదు. మరింత రెఛ్చిపోయారు. అటు న్యూయార్క్, ఫిలడెల్ఫియా సహా సుమారు 140 నగరాల్లో నిరసనకారులు ర్యాలీలు నిర్వహించారు. కొంతమంది షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలోకి చొరబడి తమకు అందినంతా దోచుకుపోయారు. సుమారు నలభై నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇంత జరుగుతున్నా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం చోద్యం చూస్తున్నారు. తనకు ఎదురే లేదని చాటుకున్న ఆయన నిన్న వైట్ హౌస్ కిందగల బంకర్ లోకి వెళ్లి అక్కడి పరిస్థితిని చూసి గంట తరువాత బయటికి రావడం విశేషం. అంటే పరిస్థితి మరింత విషమిస్తే తాను ఈ బంకర్ లో తలదాచుకోవచ్చునేమోనని భావించి ఉండవచ్చు.