రోడ్డెక్కిన ప్రైవేటు బస్సులు.. ప్రయాణికులు ఇవి పాటించాల్సిందే…
తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులు ప్రారంభమయ్యాయి. గతానికి భిన్నంగా బస్ ప్రయాణాలు సాగుతున్నాయి. గతంలో రాత్రి అయ్యిందంటే చాలు హైదరాబాద్ రోడ్లపై ప్రైవేట్ బస్ల..
ప్రైవేట్ బస్లు రోడ్డెక్కాయి. తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులు ప్రారంభమయ్యాయి. గతానికి భిన్నంగా బస్ ప్రయాణాలు సాగుతున్నాయి. గతంలో రాత్రి అయ్యిందంటే చాలు హైదరాబాద్ రోడ్లపై ప్రైవేట్ బస్ల హడావిడి ఓ రేంజ్లో ఉండేది. వందల బస్లు బారులు తీరేవి. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడక్కడ మాత్రమే బస్లు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్నగరంలోని మెయిన్ సెంటర్లు మాత్రమే ప్రైవేటు బస్సులకు అడ్డా. ఇందులో ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, లక్డీకాపూల్ దగ్గర ఇప్పుడు ఆ సందడి కనిపించడం లేదు. ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగానే ఉంది. మరోవైపు కరోనా ఆంక్షలను పాటిస్తూ సర్వీసులను నడుపుతున్నాయి ప్రైవేట్ సంస్థలు. మాస్క్ పెట్టుకుంటేనే ప్రయాణికులను బస్ ఎక్కిస్తున్నారు. చేతులకు శానిటైజర్ ఇస్తున్నారు. బస్ల్లో సీటింగ్ పూర్తిగా మారిపోయింది. పక్కపక్కన కూర్చునే వీలు లేదు. బుక్ చేసుకున్న పక్క సీటును బ్లాక్ చేస్తున్నారు. స్లీపర్ కోచ్ల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ఇంకా మొదలు కాలేదు. ఎప్పుడు ప్రారంభం అవుతాయో కూడా తెలియదు. ఈ నేపథ్యంలోనే మొదలైన ప్రైవేట్ సర్వీసుల్లోనూ ప్రయాణికులు అంతంత మాత్రంగానే ఉంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బస్ ప్రయాణం చేస్తున్నారు.
కరోనా వల్ల గతానికి ఇప్పటికీ ప్రయాణం పూర్తిగా మారిపోయిందంటున్నారు. టెంపరేచర్ చెక్ చేసిన తర్వాతే లోపలకు ఎక్కిస్తున్నామని చెబుతున్నారు. సీటింగ్ కూడా మారిపోయిందని, 30 సీట్లు ఉంటే… 15 మందికి మాత్రమే టిక్కెట్లు ఇస్తున్నామని చెబుతున్నారు డ్రైవర్లు.